ఏపీ సీఎం- డిప్యూటీ సీఎంల ఇళ్లలో ప్రధాని సర్ప్రైజ్

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు హైదరాబాద్లో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి.. వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. రాజకీయ కార్యకలాపాలకు అతీతంగా సాగిన ఈ భేటీలో ప్రధాని అత్యంత ఆత్మీయంగా అందరితో కలిసిపోయారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడమే కాకుండా.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక దేశాధినేత ఇలా నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యులతో సమయం వెచ్చించడం అరుదైన - గౌరవప్రదమైన విషయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ కూడా ఎంతో సాదాసీదాగా అందరినీ పలకరించారు. ప్రధాని తమ నివాసానికి రావడం పట్ల పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల స్పందిస్తూ.. మోదీ గారు తమ పిల్లలతో ఎంతో ఓపికగా మాట్లాడి వారి భవిష్యత్తు ఆశయాల గురించి అడిగి తెలుసుకోవడం తమను మంత్రముగ్ధులను చేసిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తూ ప్రధాని చూపిన మానవీయ కోణం తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పర్యటన రాజకీయ బంధాల కంటే మిన్నగా ఆత్మీయ అనుబంధాలను చాటిచెప్పింది.








































