దిల్ రాజు కుట్రలపై నట్టి సంచలన వ్యాఖ్యలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `పెద్ది` చిత్రం చుట్టూ జరుగుతున్న తెరవెనుక రాజకీయాలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం మొత్తం ఇండస్ట్రీలోని ఇద్దరు అగ్ర శక్తులైన దిల్ రాజు - మైత్రి మూవీ మేకర్స్ మధ్య నడుస్తున్న ఈగో గొడవ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.
పైకి మీడియా ఎదుట ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడే వ్యక్తులు, లోపల మాత్రం డిస్కషన్ల పేరిట మైత్రి ఆఫీస్ను మూయించాలని, వారి సినిమాలను థియేటర్లలో రిలీజ్ కానివ్వకుండా చేయాలని రకరకాల తంత్రాలు నడుపుతున్నారని ఆరోపించారు. అయితే ఇండస్ట్రీలో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అంతిమంగా `కంటెంటే కింగ్` అని, ప్రేక్షకులు ఆదరిస్తే `పెద్ది` సినిమా విడుదలను ఆపడం ఎవరి తరం కాదని నట్టి కుమార్ గట్టిగా స్పష్టం చేశారు.
ఈ గొడవల్లో ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమాలకే ఎందుకు సమస్యలు వస్తున్నాయనే అంశంపై నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్దకు వస్తున్న ప్రతిసారీ థియేటర్ల వివాదాలు, రెంట్ల పంచాయితీలు తెరపైకి తేవడం వెనుక ఒక పక్కా ప్లాన్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తెరవెనుక జరుగుతున్న ఈ కుట్రలను, రాజకీయాలను మెగా హీరోలంతా నిశితంగా గమనిస్తున్నారని వెల్లడించారు. స్వయంగా చిరంజీవి గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు ఈ పరిణామాలన్నింటినీ చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వాళ్లు చూస్కుంటారని హెచ్చరించారు.






































