వైజాగ్లో ల్యాండ్ అయిన జక్కన్న టీమ్!
Jakkanna's team has landed in Vizag!తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `వారణాసి`. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా సంచలన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ ఫాంటసీ మైథలాజికల్ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ రెట్టింపవుతున్నాయి. కాగా ఈ సినిమా కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం దర్శకుడు రాజమౌళి సాంకేతిక బృందంతో కలిసి విశాఖపట్నం చేరుకున్నారు. తాజా షెడ్యూల్లో చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను భారీ ఎత్తున చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సర్వసిద్ధం చేస్తోంది.
భారీ బడ్జెట్తో గ్లోబ్ట్రాటింగ్ అడ్వెంచర్ నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. చారిత్రక, పౌరాణిక , ఆధునిక అంశాల కలబోతగా సాగే కథను వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించేందుకు రాజమౌళి ఎక్కడా రాజీ పడకుండా సరికొత్త లోకేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు.
సర్వం సిద్దం చేసిన అనంతరం సూపర్ స్టార్ మహేష్ కూడా వైజాగ్ రీచ్ అవుతారని తెలుస్తోంది. వైజాగ్లో జరగబోయే ఈ తాజా షెడ్యూల్ సినిమా కథాగమనంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందది. ఇక్కడి లోకేషన్లలో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను సృష్టించనున్నారని సినీ ప్రియులు ఆసక్తిగా గమనిస్తున్నారు.








































