తొమ్మిదేళ్ల తర్వాత రిలీజ్కి కోర్టు గ్రీన్ సిగ్నల్

చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ధ్రువ నక్షత్రం విడుదలకు ఉన్న అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కుల వల్ల ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాపై మద్రాస్ హైకోర్టు తాజాగా కీలక తీర్పునిచ్చింది. ఈ చిత్రాన్ని 2026 జూన్ 15లోపు థియేటర్లలో విడుదల చేయాలని జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఆదేశించారు. 2017 నుండి పెండింగ్లో ఉన్న బకాయిలను తీర్చడానికి వీలుగా.. సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని కోర్టు పర్యవేక్షణలోనే వినియోగించాలని నిర్ణయించడం ద్వారా ఈ స్పై థ్రిల్లర్ విడుదలకు లైన్ క్లియర్ అయింది.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విక్రమ్తో పాటు వినాయకన్, రీతూ వర్మ, పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్కుమార్ వంటి దిగ్గజ తారాగణం నటించారు. మనోజ్ పరమహంస, జోమన్ టి జాన్ వంటి ప్రముఖ ఛాయాగ్రహకులు పనిచేసిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
ఒండ్రాగా ఎంటర్టైన్మెంట్ - ఒరు ఊరిలే ఒరు ఫిల్మ్ హౌస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో గౌతమ్ మీనన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నిర్ణయంతో ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడటమే కాకుండా.. సినిమా ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కూడా ఏర్పడనుంది.








































