ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> V Vijaysai Reddy Safe with Shanthi Press Meet

విజయసాయి సేఫ్ జోన్‌లో పడినట్టే!

V Vijaysai Reddy Safe with Shanthi Press Meet

వైసీపీ ఎంపీ, సీనియర్ నేత విజయసాయి రెడ్డి.. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అని గత 48 గంటలుగా మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎంత రచ్చ జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా.. దీన్నే అదనుగా చేసుకున్న అధికార టీడీపీ అయితే సాయిరెడ్డి ముసలోడే కానీ మహానుభావుడు అంటూ నానా హడావుడి చేసింది. తన భార్య గర్భం, పుట్టిన కుమారుడికి కారణం ఎవరో తెలియాల్సిందేనని శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేయడంతో ఇదంతా ఇక్కడి వరకు వచ్చింది. దీనికి తోడు.. అటు సాయిరెడ్డి నుంచి.. ఇటు శాంతి నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోయే సరికి ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది. ఈ క్రమంలోనే శాంతి మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది అనే దానిపై పచ్చి నిజాలు బయట పెట్టారు. ఈ మీడియా సమావేశంతో విజయసాయి సేఫ్ జోన్లో పడినట్టే అని చెప్పుకోవచ్చు.

ఇంతకీ ఏం జరిగింది..?

విజయవాడ వేదికగా మీడియా మీట్ పెట్టిన శాంతి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. 2013 నవంబర్ నెలలో మదన్ మోహన్ మానిపాటితో నాకు పెళ్లి అయ్యింది. మాకు ఇద్దరు కవల పిల్లలు. 2015 లో మాకు పిల్లలు పుట్టారు. నేషనల్ ఓవర్ సీస్ స్కాలర్ షిప్ ఇంటర్వ్యూకి వెళ్ళాం. మదన్ మోహన్ మానిపాటి అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి. నన్ను దారుణంగా హింసించాడు. రెండేళ్లు నన్ను దారుణంగా హింసించాడు. 2016లోనే మేము విడాకులు రాసుకున్నాం. మా గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకులు రాసుకున్నాం. 2019లోనే మదన్ మోహన్ యూఎస్ వెళ్ళిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చిందని శాంతి చెప్పుకొచ్చారు.

ఇదీ అసలు సంగతి..!

నేను, న్యాయవాది సుభాష్ ఇద్దరం ఇష్టపడ్డాం. మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. నేను నవమాసాలు మోసి బిడ్డను కన్నాను. నేను సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాక కూడా నన్ను వేధించాడు. మదన్ మోహన్, నేను ఇద్దరం కూడా విశాఖపట్నం కోర్టులో విడాకులు తీసుకున్నాం. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. నేను ఓ గిరిజన మహిళను కాబట్టి నన్ను టార్గెట్ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిని నేను విశాఖపట్నంలోనే చూశాను. ఆయనపై దుష్ప్రచారం చెయ్యడం అత్యంత దారుణం. ఆయన వయసు 68.. నా వయసు 35 అసలు ఎలా సంబంధాలు అంట గడతారు. ఇప్పుడు మీతో (మీడియా మిత్రులను ఉద్దేశించి) మాట్లాడుతున్నా అలా అని ఏదేదో ఊహించుకుంటే ఎలా..? అని శాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏం మాట్లాడకూడదా..?

ప్రేమ సమాజంకు చెందిన 30 ఎకరాల భూములు సాయి ప్రియ రిసార్ట్స్ తక్కువ ధరకు లీజు తీసుకున్నారు. దాన్ని తనిఖీ చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచాను. నేను విజయసాయిరెడ్డితో కేవలం డిపార్ట్ మెంట్‌కి సంబంధించిన విషయాలే మాట్లాడాను. ఏ ఆఫీసర్, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడకూడదా..?. ఆంధ్రజ్యోతిలో 100 కోట్లు సంపాదించానని రాశారు. అందుకు మదన్ మోహన్ నన్ను 75 కోట్లు అడిగారు. నేను ఆయనకు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి..?. నేను గిరిజన మహిళను అని కక్ష గట్టి నన్ను సస్పెండ్ చేశారు. నా మీద పెట్టిన చార్జెస్ లో 8 విషయాలు అసలు నాకు సంబంధించినవే కాదు. నాకు ఇద్దరు అడబిడ్డలు ఉన్నారు. నా వ్యక్తిత్వ హననం చేశారు. నా ఆడబిడ్డలకు భవిష్యత్తులో పెళ్లి ఎలా చేయాలి..? అని శాంతి కంటతడి పెట్టారు.

అవును నిజమే..!

మదన్ మోహన్ 2016లో నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. 2016 నుంచి నేను మదన్ మోహన్‌తో సంసారం చెయ్యలేదు. రూ. 30 కోట్లు కావాలని మదన్  డిమాండ్ చేసేవాడు. మీడియా నా బిడ్డను అక్రమ సంతానం అనడం దారుణం. నేను ఇప్పుడు సుభాష్‌తోనే ఉన్నాను.. మాకు బిడ్డ పుట్టాడు. అడ్వకేట్ దగ్గర మేము ఎంఓయూ రాసుకున్నప్పుడు మదన్ మోహన్ ఆ బిడ్డ నా బిడ్డ కాదని లిఖితపూర్వకంగా కూడా రాశాడు. నన్ను వేధించినప్పుడు నేను మదన్ మోహన్‌పై కేసు కూడా పెట్టాను. మదన్ మోహన్ అమెరికా అక్రమంగా వెళ్ళాడు. మదన్ మోహన్ మీద కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను. నేను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా నన్ను కొట్టేవాడు. నేను చచ్చిపోతే నా చావుకి ఈ ఆరోపణలు చేసినవాళ్లే కారణం అవుతారని శాంతి చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. భార్య భర్తల మధ్య గొడవ ఇక్కడి దాకా వచ్చింది. ఇంట్లో మాట్లాడుకోవాల్సిన మాటలు.. నలుగురిలో మాట్లాడుకుంటే ఎలా అని తిట్టి పోస్తున్నారు జనాలు.

Shanthi Press Meet on Vijaysai Reddy and Madan Issue

vijaysai reddy and shanthi