అందుకే దేవీప్రసాద్‌ ఓడిపోయారట..!!

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీచేసి దేవీప్రసాద్‌ ఓటమి చెందడం అటు టీఆర్‌ఎస్‌ వర్గాలతోపాటు ఎన్జీఓల నేతలను కూడా విస్మయానికి గురిచేసింది. దేవీప్రసాద్‌ను కావాలనే బలిపశువును చేశారన్న వాదనలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై స్పందించడానికి ఇది సరైన సమయం కాదంటూ దేవీప్రసాద్‌ కూడా ప్రకటించడం మరింత ఆందోళనకు దారితీసింది. ఈ విషయాన్ని పక్కనపెడితే హైదరాబాద్‌లోని పట్టభద్రుల వల్లే దేవీప్రసాద్‌ ఓడిపోయారని టీ-ఎన్జీఓల కొత్త అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లుగా నమోదయ్యారని, వారికి టీఆర్‌ఎస్‌పై సరైన అవగాహన లేకపోవడంతోనే దేవీప్రసాద్‌ ఓటమిచెందారని ఆయన విశ్లేషించారు. ఇక దేవీప్రసాద్‌ను బలిపశువును చేశారన్న వార్తలపై ఆయన నేరుగా స్పందించకున్నప్పటికీ కేసీఆర్‌ దేవీప్రసాద్‌కు సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నామని, ఆయనకు తగిన పదవిని కేటాయిస్తారని కూడా చెప్పారు. అయితే హైదరాబాద్‌లోని పట్టభద్రులు టీఆర్‌ఎస్‌కు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో కూడా రవీందర్‌రెడ్డి చెప్పి ఉంటే బాగుండేది. ఇక్కడున్న సీమాంధ్ర విద్యార్థులు, ఇతర రాష్ట్రాల విద్యార్థుల వల్లే దేవీప్రసాద్‌ ఓడిపోయారన్నది రవీందర్‌రెడ్డి ఉద్దేశం కావొచ్చు.

devi prasad
mlc elections
defeat
reasons