స్టార్ డైరెక్టర్కు హత్యా బెదిరింపు
Rohit Shetty receives death threatsఆర్థిక రాజధాని ముంబైలో కొంతకాలంగా మాఫియా రీయాక్టివేట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీసెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది ఈ మాఫియా. ఇటీవల సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని బెదిరించడమేగాక, అతడి స్నేహితులను టార్గెట్ చేస్తోంది. సల్మాన్ స్నేహితుడు రోహిత్ శెట్టికి కొద్ది నెలల క్రితం బెదిరింపులు ఎదురవ్వడం తెలిసిందే.
ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టిని లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ ముఠా మరోసారి కలకలం సృష్టించింది. ఈసారి ఆయన సిబ్బందికి అందిన ఒక ఆడియో సందేశంలో ఏకంగా రూ. 20 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ, లొంగకపోతే నేరుగా దాడి చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జుహులోని ఆయన నివాస ప్రాంతం వద్ద ఐదు రౌండ్ల కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఇప్పుడు తాజా ఆడియో క్లిప్ రావడం సినీ వర్గాల్లో ఆందోళన పెంచింది. ఈ వ్యవహారంపై జుహు పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి, ఆ వాయిస్ రికార్డింగ్ను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు.
ఈ తరహా అండర్వరల్డ్ బెదిరింపులు ఎన్ని ఉన్నా రోహిత్ శెట్టి తన వృత్తిపరమైన బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నారు. ఆయన సారథ్యంలోని పాపులర్ రియాలిటీ షో `ఖత్రోన్ కే ఖిలాడీ` సీజన్ 15 జూలై 25 నుండి బుల్లితెరపై ప్రసారం కానుంది. ఈసారి గౌరవ్ ఖన్నా, రుబినా దిలైక్, ఓరీ, కరణ్ వాహి వంటి ప్రముఖులు కంటెస్టెంట్లుగా అలరించబోతున్నారు. మరోవైపు శెట్టి దర్శకత్వం వహిస్తున్న క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ `గోల్మాల్ 5` చిత్రానికి సంబంధించి తుషార్ కపూర్ షెడ్యూల్ను పూర్తి చేసుకోగా, ఈ ఫ్రాంచైజీలో అక్షయ్ కుమార్ కూడా భాగమైన సంగతి తెలిసిందే.







































