ఏపీలో టాలీవుడ్ అభివృద్ధి.. ఇంకెక్కడ బాలయ్యా!
Balakrishna Raises Concerns Over Telugu Cinema
మన రాజకీయ నాయకుల ప్రకటనలు ఘనం.. పనులు శూన్యం! ఇంకా రాజధాని లేకుండానే ఏపీలో కొత్త టాలీవుడ్ ని అభివృద్ధి చేస్తామని అంటున్నారు. అడపాదడపా నాయకులు ప్రజల మధ్యకు వచ్చి డిప్లమాటిగ్గా రొటీన్ గా ఒక డైలాగ్ పడేసి వెళ్లిపోవడం చాలా కాలంగా చూస్తున్నదే. పదేళ్ల కాలం ముగుస్తున్నా కానీ ఇప్పటికీ మరో కొత్త టాలీవుడ్ నిర్మాణానికి ఏ కోణంలోను అడుగులు వేయకపోవడం ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దం కావస్తున్నా, నవ్యాంధ్రలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రకటనలు వెలువడుతున్నాయి తప్ప పనులు మాత్రం శూన్యంగానే మారాయి. అమరావతి లేదా విశాఖపట్నంకి ఇండస్ట్రీని తరలించాలనే ప్రతిపాదనలు గతంలో వినిపించినా కానీ.. వాస్తవ రూపం దాల్చడానికి ప్రయత్నాలు ఏవీ జరగలేదు.
ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే.. కనీసం నంది అవార్డుల గురించి అయినా ప్రభుత్వం ఆసక్తి కనబరచనే లేదు. అయితే సినీపెద్దలే దీని గురించి అంత ఆసక్తిగా లేరని, అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తూ నీరుగారుస్తున్నారు తప్ప ప్రభుత్వ పెద్దల్ని కలవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. రెండు చేతులను జోడిస్తేనే చప్పట్లు. కానీ అది జరగడం లేదని తీవ్ర విమర్శలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇప్పటికీ తెలుగు సినిమాలకు వచ్చే మొత్తం వసూళ్లలో 60 నుండి 70 శాతం కలెక్షన్లు కేవలం ఏపీ నుంచే వస్తున్నాయని గుర్తుచేశారు. ఇంతటి భారీ ఆదరణ ఉన్న ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు విజయవాడ సినిమాకు ఎలా ప్రాధాన్యతనిచ్చిందో ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగుతోందని అన్నారు. ఏపీలో ప్రతిభ పుష్కలంగా ఉందన్న బాలయ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని సినిమా హబ్గా మార్చేందుకు, పరిశ్రమ వృద్ధికి తాము సంపూర్ణంగా సహకరిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఏపీలో షూటింగ్ వసతులు పెరిగితే ఇక్కడి యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.







































