ఆ రోజులు పోయాయి.. ఇప్పుడు అస్సలు ఆడవు!

అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ `హమ్ తుమ్`, `సలామ్ నమస్తే` వంటి రొమాంటిక్ కామెడీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలతో లవర్ బాయ్గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అయితే, మారుతోన్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తోన్న మార్పులపై తాజాగా సైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సినీ పరిశ్రమలో రొమాంటిక్ కామెడీలు విఫలమైన ప్రయోగంగా మారిపోయాయని అభిప్రాయపడ్డారు.
ఈ తరం ప్రేక్షకుల ఆలోచనా సరళి పూర్తిగా మారిపోయిందన్నారు. అందుకే పాత రొటీన్ రామ్కామ్ కథలతో ప్రస్తుత ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు వెండితెరపై మరింత లోతైన, వాస్తవికతకు దగ్గరగా ఉండే లేదా భారీ యాక్షన్ డ్రామాలను చూడటానికే ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. కాలం చెల్లిన ఫార్ములా రొమాంటిక్ సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదన్నారు.
అందుకే తాజా ట్రెండ్కు తగ్గట్టుగా నటులు, దర్శకులు మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు రొమాంటిక్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సైఫ్ అలీ ఖానే ఈ జానర్ పై ఇలాంటి ప్రాక్టికల్ కామెంట్స్ చేయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అందుకే ఆయన కూడా ఇటీవల కాలంలో కమర్షియల్ లవ్ స్టోరీలకు దూరంగా ఉంటూ విలక్షణమైన, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో దూసుకుపోతున్నారు. మరి సైఫ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్తులో బాలీవుడ్ మేకర్స్ రొమాంటిక్ కామెడీ చిత్రాలను సరికొత్తగా ఎలా ప్రెజెంట్ చేస్తారో? ప్రేక్షకుల నమ్మకాన్ని ఎలా? గెలుచుకుంటారో చూడాలి.






































