ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Govt's ₹1Lakh Reward To End Corruption

సీఎం విజ‌య్: అవినీతి జ‌ల‌గ‌ను ప‌ట్టిస్తే బ‌హుమ‌తి

 

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో అవినీతిని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా సరికొత్త విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేసినట్లు పక్కా వీడియో ఆధారాలు సమర్పిస్తే.. సదరు సామాన్య పౌరుడికి ప్రభుత్వం తరఫున రూ. 1 లక్ష నగదు బహుమతి అందించేలా ఒక ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రతిపాదించారు. అధికారులు ఆశించిన లంచం మొత్తం కేవలం రూ. 1000 లేదా అంతకంటే తక్కువ ఉన్నా బాధితులు నిరభ్యంతరంగా ఫిర్యాదు చేసి ఈ భారీ రివార్డును అందుకోవచ్చు.

ఇందుకోసం రాష్ట్రంలోని అవినీతి నిరోధక శాఖను పూర్తి సర్వాధికారాలతో రీఎరేంజ్ చేసారు. అయితే ఈ ప్రక్రియలో లంచగొండులను పట్టిచ్చే పౌరుల వ్యక్తిగత వివరాలను, డేటాను అత్యంత సీక్రెట్‌గా ఉంచడం వారి భద్రతకు అత్యవసరమని మేధావులు భావిస్తున్నారు. అధికారులు నేరుగా లంచం అడగకుండా పేపర్‌వర్క్‌తో వేధించే పరోక్ష అవినీతి ఎత్తుగడలను సైతం అడ్డుకుంటే.. ఈ యాంటీ కరప్షన్ ఫ్రేమ్‌వర్క్ తమిళనాడు చరిత్రలోనే ఒక అతిపెద్ద గేమ్ చేంజర్‌గా నిలిచిపోవడం ఖాయం.

అవినీతిపై ఉక్కుపాదం మోపుతూనే ప్రజా సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడంలో విజయ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. గతంలో 2013లో మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత ప్రారంభించిన చారిత్రాత్మక `అమ్మ క్యాంటీన్ల`వ్యవస్థను గౌరవిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 600కు పైగా క్యాంటీన్ల మౌలిక వసతులను, ఆహార నాణ్యతను తక్షణమే మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. చెన్న న‌గ‌ర ప‌రిధిలోని 383, ఇత‌ర ప్రాంతాల‌లోని 237 క్యాంటీన్ల ఆధునీకరణకు ఆయా స్థానిక సంస్థల సాధారణ నిధుల నుంచే ఖర్చు చేసేలా ప్రణాళిక చేశారు.

దీనితో పాటు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన 1.3 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ. 1000 నెలవారీ ఆర్థిక సహాయాన్ని జమ చేసే పథకాన్ని కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలను నిరంతరాయంగా నడుపుతూనే.. వ్యవస్థను ప్రక్షాళన చేసే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి విజయ్, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసే దిశగా దూసుకుపోతున్నారు.

Vijay ,Vijay Govt's ₹1Lakh Reward To End Corruption