మోహన్ లాల్ `దృశ్యం 4- 5' లీక్!

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన `దృశ్యం` ఫ్రాంచైజీ నుండి మూడవ భాగం `దృశ్యం 3` పై తాజాగా దర్శకుడు జీతూ జోసెఫ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత రెండు సినిమాల్లో జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోలీసుల కళ్లు కప్పి తెలివైన ఎత్తుగడలు వేయడం చూశాం. అయితే మూడవ భాగం గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతోందని దర్శకుడు స్పష్టం చేశారు. ఈసారి కథా గమనం ఒక నేరాన్ని దాచడం చుట్టూ కాకుండా మరింత లోతైన మానసిక సంఘర్షణ ,ఊహించని మలుపులతో సాగుతుందని వెల్లడించారు.
జార్జ్ కుట్టి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సందర్భంగా అభిమానులకు మరో భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. `దృశ్యం 3`తో ఈ ప్రయాణం ముగిసిపోదని ఈ ఫ్రాంచైజీలో `దృశ్యం 4` `దృశ్యం 5` కూడా ఉండే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. ఈ వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. జార్జ్ కుట్టి కుటుంబాన్ని పోలీసులు ఎప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉంటారని ఆ సుదీర్ఘ పోరాటాన్ని మరిన్ని భాగాలుగా చూపించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.
`దృశ్యం 3` ఈనెల 21న రిలీజ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జార్జ్ కుట్టి వేసే ఎత్తులకు పోలీసులు పైఎత్తులు వేయడం చివరకు నీతి గెలుస్తుందా లేక కుటుంబ ప్రేమే విజయం సాధిస్తుందా? అనే ఉత్కంఠను జీతూ జోసెఫ్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో ఎలా చూపిస్తారో అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.








































