మహా టీవీ ఆఫీసుపై దాడిని ఖండించిన లోకేష్

కొద్దిరోజులుగా తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పలు మీడియా ఛానల్స్ వరస కథనాలతో ప్రసారం చేస్తున్నాయి. అందులో మహా న్యూస్ ఛానల్ కూడా ఉంది. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఫోన్ టాపింగ్ వార్తలను మహా న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తూ ఉండడంతో ఈరోజు కొంత మంది బిఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ లోని మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసారు.
ఛానల్ ఆఫీస్ పై దాడి చేసి కొన్ని కారుల అద్దాలని పగలకొట్టడంతో పాటు ఆఫీస్ లోపలకి చొరబడడం హాట్ టాపిక్ గా మారింది. తమ నాయకుడు కేటీఆర్ పై ఇలాంటి కథనాలను ఎలా ప్రసారం చేస్తారు అంటూ బిఆర్ఎస్ కార్యకర్తలు మహా ఛానల్ ఆఫీస్ పై దాడి చెయ్యడం కలకలం సృష్టించింది.
మహా టివి పై దాడిని మినిస్టర్ నారా లోకేష్ ఖండించారు. హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు,ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే, తెలియజేయవచ్చు. వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను.. అంటూ లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
BRS Cadres Attack Mahaa News Office
Lokesh Condemns Attack on Mahaa News Office







































