ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> MM Keeravani Comments at Ramoji Rao Samsmarana Sabha

నాడు రజినీ.. నేడు కీరవాణి!

కాదేది కల్తీకి అనర్హం అనే మాట చాలా సందర్భాల్లో వినే ఉంటాం కదూ..! ఇప్పుడు వైసీపీ టార్గెట్‌కు ఎవరూ అతీతులు కాదన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. నాడు ఆంధ్రుల ఆరాధ్య దైవం, అన్నగారు ఎన్టీఆర్ జయంతి ఉత్సావాల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్‌.. చంద్రబాబు, ఆయన చేసిన అభివృద్ధిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు మొదలుకుని నేతలు, మంత్రులు ఏ రేంజిలో విరుచుకుపడ్డారో చెప్పకర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రజినీపై వైసీపీ దండయాత్రే చేసింది. బాబోయ్.. కొందరైతే నోటికొచ్చినట్లుగా కారు కూతలు కూసేశారు. ఆఖరికి ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అంటూ కూడా తిట్టేసిన పరిస్థితి. ఇక ఆయన సంగతి అలా ఉంచితే.. సరిగ్గా ఇప్పుడు నాటి రజినీలాగానే ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి వైసీపీకి టార్గెట్‌ అయ్యారు. అసలేం జరిగింది..? ఎందుకింతలా తిట్టేస్తున్నారనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..!

ఏం జరిగింది..?

విజయవాడ వేదికగా చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభలో కీరవాణి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో ప్రేమించే వ్యక్తి రామోజీరావు అని.. రాష్ట్రం కబంధ హస్తాల్లో నుంచి బయటపడటం కళ్లారా చూసి అప్పుడు ఆయన నిష్క్రమించారని కీరవాణి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బతికితే రామోజీరావులా బతకాలని ఓ సభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన కానీ ఇప్పుడు మరణించినా ఆయనలాగే మరణించాలని చెప్పుకొచ్చారు. చూశారుగా.. ఆయన ఎవర్ని ఉద్దేశించి చేశారన్నది చెప్పలేదు. పోనీ డైరెక్టుగా మనిషి పేరు గానీ.. పార్టీ పేరుగానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ.. గుమ్మడికాయల దొంగా అంటే.... గుద్దుకున్నట్లుగా అవును మా పార్టీనే అన్నారని, వైఎస్ జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారని వైసీపీ తెగ హడావుడి  చేస్తోంది.

ఎందుకింత రచ్చ..?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. రామోజీరావును భీష్ముడు, సూర్యుడితో పోల్చి మరీ మాట్లాడారు. ఈ మాటలు అన్నీ విన్న సీఎం చంద్రబాబు చిరునవ్వు చిందించారు. దీంతో బాబు కళ్లలో ఆనందం చూడటానికి కీరవాణి ఇలా మాట్లాడారని వైసీపీ విమర్శిస్తున్న పరిస్థితి. పొగడాలి.. ఆకాశానికి ఎత్తాలంటే మీరు మీరు చూసుకోవాలంతే కానీ.. వైసీపీ, జగన్‌ను పరోక్షంగా తిట్టడమేంటి..? అయినా అంత అవసరమేంటి..? అని తిట్టేస్తున్నారు. ఇలాంటోళ్లకేనా ఆస్కార్ వచ్చింది..? అని విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. మరోవైపు.. కులం పేరును ప్రస్తావించి మరీ వైసీపీ పైత్యం ప్రదర్శిస్తోందంటే ఎంత సైకోల్లాగా కార్యకర్తలు ఉన్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే.. బాబోయ్ మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం అంతే..!. అధికారంలో వైసీపీ లేదు కాబట్టి కాస్త విమర్శలతో, కౌంటర్లతో వదిలిపెట్టామని లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని కొ మరికొందరు కార్యకర్తలు బహిరంగంగానే సోషల్ మీడియా వేదికగా వార్నింగ్‌లు ఇస్తుండటం గమనార్హం. అతిగా ఆవేశపడి ఇలా విమర్శలు గుప్పి్ంచే రజినీ విషయంలో వైసీపీ ఏ పరిస్థితి వచ్చిందో తెలుసు కదా. రేపొద్దున్న ఇంకా ఎక్కువ చేస్తే.. ఈ సోషల్ మీడియా, వైసీపీ కార్యకర్తలను తిట్టిపోస్తూ ఒక వీడియో లేదా పాటను కీరవాణి రిలీజ్ చేశారనుకోండి అంతే సంగతులు ఇక. అసలే రజినీ విషయంలో పరువు పోగొట్టుకున్న వైసీపీ.. ఇప్పుడు కీరవాణి విషయంలో ఉన్న పరువు పోగొట్టుకోవడం అవసరమా..?. అందుకే ఎదుటివాళ్లను విమర్శించే ముందు ఆచి, తూచి మాట్లాడితే మంచిది సుమీ..!

YCP Fire on Rajini and Keeravani Comments

MM Keeravani Comments at Ramoji Rao Samsmarana Sabha
keeravani and rajinikanth