ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Supreme Court Gives Shock to AP CM Jagan Mohan Reddy

జగన్‌కు ఒకేరోజు రెండు దెబ్బలు..

Supreme Court Gives Shock to AP CM Jagan Mohan Reddy

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి‌కి సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక్కరోజు రెండు గట్టి దెబ్బలు తగిలాయి. దేశ చరిత్రలో అత్యధిక కాలం బెయిల్‌పై బయట ఉన్న సీఎంగా జగన్ రికార్డ్ సృష్టిస్తున్నారు. జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీచేయాలంటూ రెండు పిటిషన్లను ఎంపీ రఘురామ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై నేడు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. అయితే ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రఘురామ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు జగన్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

కేసుల విచారణ జాప్యానికి కారణమేంటి?

ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసినందునే బెయిల్ రద్దు పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తీసుకొచ్చారు. ఈ కేసులో తాము రాజకీయ పరమైన అంశాల జోలికి పోవడం లేదని, కేవలం న్యాయపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ బెయిల్ రద్దు కేసు ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. జగన్ కేసుల విచారణ జాప్యానికి కారణమేంటి? అసలు దీనికి ఎవరు బాధ్యులు అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. డిశ్చార్జ్ పిటీషన్లను విచారించడానికి ఎందుకంత సమయం తీసుకున్నారని నిలదీసింది. విచారణ జాప్యంలో వాయిదాలకు తమకేమీ సంబంధం లేదని కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది తుషార్ మెహతా తెలిపారు. దీంతో సీబీఐకి సంబంధం లేకపోతే వేరే ఎవరికి సంబంధం ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. 

రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో..

సీబీఐ, జగన్ కుమ్మక్కయ్యే ఈ కేసును జాప్యం చేస్తున్నారని పిటిషనర్ ఎంపీ రఘురామ తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి ముకుల్ రోహిత్గి తీసుకొచ్చారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతవరకూ కేసు విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నామని సుప్రీం తెలిపింది. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్‌ఫర్ పిటిషన్లపై సీబీఐకి గతంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అలాగే.. విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను లేఅవుట్‌ చేసి అమ్మకాలు చేపట్టడంపై స్టే విధిస్తూ.. ఏపీ ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Two Blows to YS Jagan in One Day

ys jagan mohan reddy