ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan extended his support to YSRCP

వైఎస్ జగన్‌కు పవన్ కళ్యాణ్ సపోర్ట్

Pawan Kalyan extended his support to YSRCP
జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు. నిజంగా నిజమిది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ‘రాజకీయాలే కంటే కూడా రాష్ట్రం మిన్న’ అంటూ తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని వరుస ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. వైజాగ్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వానికి జనసేన మద్దతు ప్రకటించింది. అలా అనీ వదిలేయకుండా కొన్ని సూచనలు కూడా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్‌పై పొగడ్తల వర్షం కురుస్తోంది. నిజమైన రాజకీయ నాయకుడని అనిపించుకున్నావ్ అంటూ.. వైసీపీ వాళ్లు కూడా పవన్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు.
‘‘దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు, మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను.
వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం
ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి. ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండి. 
ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సంపూర్ధ మద్దతును అందిస్తోంది. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న’’ అంటూ పవన్ కళ్యాణ్ తన వరస ట్వీట్స్‌లో తెలిపారు. ఈ ట్వీట్స్‌పై జనసేన అభిమానులు, వైసీపీ అభిమానులు, ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండటం విశేషం.

Pawan Kalyan Tweet on Vizag Global Investors Summit

global investors summit
pawan kalyan
janasena
ysrcp