రానా దగ్గుబాటి కొత్త చిత్రం ఫిక్సయింది

విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్లో రానా, మిలింద్ రౌ కాంబినేషన్లో కొత్త చిత్రం
‘బాహుబలి’లో భల్లాలదేవ...‘ఘాజి’లో అర్జున్ అనే నేవీ ఆఫీసర్గా, ‘నేనే రాజు నేనే మంత్రి’ లో రాజకీయ నాయకుడిగా ఇలా ఒక్కొక్క సినిమాలో ఒక్కో తరహా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యువ కథానాయకుడు రానా దగ్గుబాటి డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈయన హీరోగా ‘గృహం’ వంటి హారర్ థ్రిల్లర్తో సూపర్హిట్ సాధించిన దర్శకుడు మలింద్ రౌ కాంబినేషన్లో ఓ కొత్త చిత్రం ఆగస్టు నుండి ప్రారంభం కానుంది. రజనీకాంత్ భాషా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించి తెలుగులో రజనీకాంత్కు ఓ భారీ మార్కెట్ ఏర్పడటానికి కారణమైన నిర్మాణ సంస్థ విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్పై ఈ సినిమాను గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ మాట్లాడుతూ - ‘భాషా’ తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి విశ్వశాంతి పిక్చర్స్ పరిచయమైంది. చాలా గ్యాప్ తర్వాత మా బ్యానర్లో నయనతార సూపర్హిట్ చిత్రం ఇమైక్కా నొడిగల్ను అంజలి సిబిఐగా విడుదల చేస్తున్నాం. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలను మా బ్యానర్లో నిర్మించబోతున్నాం. అందులో భాగంగా రానా దగ్గుబాటి గారితో సినిమా చేయబోతున్నాం. మా బ్యానర్లో సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేసిన రానా గారికి ధన్యవాదాలు. ‘గృహం’ వంటి హారర్ థ్రిల్లర్ను రూపొందించిన దర్శకుడు మిలింద్ రౌ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఆగస్ట్ నుండి సినిమాను ప్రారంభిస్తాం. సినిమాలో పనిచేయబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం.. అన్నారు.
Rana Daggubati, U Milind Rau, VishwaShanti Pictures banner Film Announcement
Rana Daggubati New Movie Details







































