భగీరథతో వడ్లపట్ల ‘అనుబంధం’ మొదలైంది
Bhageeratha, MRC Vadlapatla Anubhandam Movie Startsఎమ్.ఆర్.సీ అసోసియేట్స్ బ్యానర్లో, ట్రిప్ ఆన్ సమర్పణలో.. భగీరథ దర్శకత్వంలో.. డాక్టర్ ఎమ్.ఆర్.సీ వడ్లపట్ల నిర్మిస్తోన్న చిత్రం ‘అనుబంధం’. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో శనివారం హైదరాబాద్ లో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎమ్.ఆర్.సీ వడ్లపట్ల మాట్లాడుతూ.. ‘‘భగీరథగారి దర్శకత్వంలో మేము నిర్మిస్తున్న ‘అనుబంధం’ చిత్రం సామాజిక సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడొస్తున్న చిన్న చిత్రాల్లో ఇదొకటి మాత్రం కాదు. ప్రతివారికి కళ్ళు చెమర్చుతాయి. సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలనే సంకల్పమే ఈ చిత్ర నిర్మాణానికి ప్రేరేపించింది. ఈ చిత్రం చూసిన చాలా మందికి కనువిప్పు కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభించి డిసెంబర్ చివరికే పూర్తి చేస్తాము. పక్కా ప్రణాళికతో షూటింగ్కి వెళ్లబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నటీనటులను ఎంపిక చేశాము. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్ర తర్వాత భగీరథగారి దర్శకత్వంలోనే ‘మాచలదేవి’ అనే టైటిల్తో మరో మూవీ ఫిబ్రవరి నుంచి ప్రారంభించనున్నాము. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్ర్కిఫ్ట్ కూడా లాక్ చేశాము..’’ అని అన్నారు.
దర్శకుడు భగీరథ మాట్లాడుతూ.. ‘‘అనుబంధం అంటే కేవలం మనిషికి మనిషికి మధ్య ఉన్న బంధం మాత్రమే కాదు. మనిషికి జంతువులకు, మనిషికి మట్టికి ఉన్న బంధాలు కూడా మనల్ని కదిలిస్తాయి.. కన్నీళ్లు పెట్టిస్తాయి. తరాల మధ్య పెరుగుతున్న అంతరం, మనిషిలో స్వార్ధం, స్వలాభం పెరిగితే ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలియజెప్పే చిత్రం ‘అనుబంధం’. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత వడ్లపట్లగారికి కృతజ్ఞతలు. దీని తరువాత కాకతీయ సామ్రాజ్య ప్రభువు ప్రతాపరుద్రుని ఆస్థానంలో రాజనర్తకి అయిన ‘మాచలదేవి’పై ఓ చిత్రం చేయబోతున్నాం. ఇది విభిన్నమైన కోణంలో ఆవిష్కరించనున్నాం..’’ అని తెలిపారు.
ఇంకా సమావేశంలో మహేంద్ర, రామ్ రెడ్డి, రమేష్, సురేష్, మురళి, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Senior Journalist Bhageeratha Turns director with Anubhandam
senior journalist
bhageeratha
director
anubhandam movie








































