రజినీకాంత్, బాలకృష్ణ ఒకరిని మించి ఒకరు..!
Rajini and Balayya speech at SISDAసినిమాలలో కేవలం 500, 1000 రూపాయల కోసం స్టార్స్ స్థానంలో యాక్షన్ సీన్స్, భారీ ఛేజింగ్లు, ప్రాణాంతకమైన స్టంట్స్ చేసేది స్టంట్ ఆర్టిస్టులు. దేశానికి సైనికులు రక్ష అయితే సినిమా స్టార్స్కి స్టంట్మేన్లు రక్ష. ఇక ఇటీవలి కాలంలోనే తీసుకుంటే రవితేజ- అనుష్క- సురేష్బాబుల కాంబినేషన్లో వచ్చిన 'బలాదూర్' చిత్రంలోని ఓ సీన్ కోసం రవితేజ డూప్ నదిలో దూకి దారుణమరణానికి గురయ్యాడు. ఇక ఇటీవల ఓ కన్నడ చిత్రం కోసం ఓ జలపాతంలో హెలికాప్టర్లోంచి దూకి ఇద్దరు స్టంట్మేన్లు మరణించారు. మరి ఇలా ప్రాణాలను రిస్క్గా పెట్టుకుని ఐదొందలో లేక వెయ్యి రూపాయల కోసమో ప్రాణాలు తెగించి, అద్భుతమైన ఫీట్లు వీరు చేసినా చివరకు ఆ క్రెడిట్, గొప్పతనం అంతా ఆ స్టార్స్కే దక్కుతుంది.
ఇలా 'బలాదూర్'లో, కన్నడ చిత్రం సందర్బంగా చనిపోయిన వారికి నిర్మాతలు తూతూ మంత్రంగా ఏదో ఇచ్చారే గానీ మగదిక్కు , సంపాదన లేని వారి కుటుంబాలకు సరైన ఆర్థిక సాయం అందించలేదు. తాజాగా దక్షిణాది భారత సినీ అండ్ టీవీ స్టంట్ ఆర్టిస్టుల యూనియన్ స్థాపించి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా చెన్నెలో ఓ భారీ వేడుక చేశారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్,మోహన్లాల్, బాలకృష్ణ వంటి అతిరధ మహారధులు హాజరయ్యారు. తనకు 68 ఏళ్లు వచ్చినా యాక్షన్ సీన్స్ చేస్తున్నానంటే అది స్టంట్ ఆర్టిస్టుల గొప్పేనని సభాముఖంగా రజనీకాంత్ వినమ్రంగా ప్రకటించాడు. స్టంట్ ఆర్టిస్టులు ఎప్పుడు ఏ సహాయం కోసం వచ్చినా 24 గంటలు తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు.
'రోబో', '2.0'లను చూస్తే విదేశీ స్టంట్మేన్లకు ఇచ్చినట్లు రెమ్యూనరేషన్ మనవారికి కూడా ఇస్తే మనవారు కూడా ఆ స్థాయిలో చేయగలరన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించేవి యాక్షన్ చిత్రాలే అని, వాటిల్లో స్టంట్ ఆరిస్ట్ల గొప్పతనమే ఎక్కువని చెప్పాడు రజనీకాంత్. ఇక బాలకృష్ణ మాట్లాడుతూ, 25 ఏళ్ల కిందట మా నాన్నగారు ఈ అసోసియన్ వేడుకలకు వచ్చారు. 50ఏళ్ల వేడుకలకి నేను, 75ఏళ్ల వేడుకలకు నా కుమారుడు, 100ఏళ్ల వేడుకకు నా మనవడు వస్తారని చెప్పాడు. ఈ వేడుకలలో బాలకృష్ణ స్టేజీ మీద చేసిన స్టంట్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.
South Indian Stunt Directors and Actors Union’s golden jubilee celebrations held in Chennai.







































