ఈ దర్శకుల రూటే వేరు..!

సాధారణంగా మొదటి సినిమా హిట్ కొట్టిన దర్శకులకు ద్వితీయ విఘ్నం కలుగుతూ ఉంటుంది. మొదటి సినిమాతో సూపర్హిట్లు అందించిన దర్శకులు ఎందరో రెండో సినిమాతో బోర్లాపడుతున్నారు. కానీ కొందరి డైరెక్టర్ల విషయంలో మాత్రం ఇది రివర్స్లో జరుగుతోంది. వారి మొదటి సినిమాలు ఫ్లాప్ అయినా వారిలోని టాలెంట్ను గుర్తించి రెండో అవకాశం ఇచ్చిన వారికి వారు సూపర్హిట్స్ అందిస్తుంటారు. దీనికి ఉదాహరణగా కొందరి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇటీవల జనవరి 1న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న రామ్ 'నేను.. శైలజ' చిత్రానికి దర్శకుడు కిషోర్ తిరుమల. వాస్తవానికి ఆయన మొదటి చిత్రం 'సెకండ్హ్యాండ్' ఫ్లాప్ అయింది. కానీ ఆయనలోని టాలెంట్ను గుర్తించిన రామ్ ఆయనకు అవకాశం ఇవ్వడంతో రెండో సినిమాతో హిట్ కొట్టాడు ఈ దర్శకుడు. ఇక 'ఏమైంది ఈవేళలో'తో మొదటి సినిమా ఫ్లాప్గా నిలబడి విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు సంపత్నంది. కానీ ఆయన ఆ తర్వాత తీసిన 'రచ్చ, బెంగాల్టైగర్'లతో హిట్టుకొట్టి కమర్షియల్ డైరెక్టర్గా పేరుతెచ్చుకున్నాడు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే మరో దర్శకుడి పేరు ప్రముఖంగా చెప్పాలి. 'ఇష్టం'తో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు విక్రమ్ కె.కుమార్కు ఆ సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది. కానీ తెలుగులో ఆయన 12ఏళ్ల తర్వాత చేసిన 'ఇష్క్, మనం' చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన సూర్యతో '24' చిత్రం చేస్తున్నాడు. ఆ వెంటనే అల్లుఅర్జున్, మహేష్బాబుల సినిమాలకు డైరెక్షన్ చేయనున్నాడు. ఇక 'షాక్' చిత్రంతో దర్శకునిగా పరిచయం అయిన హరీష్శంకర్ ఆ తర్వాత 'మిరపకాయ్' చిత్రంతో సూపర్హిట్టు కొట్టాడు. ఆ తర్వాత పవన్తో 'గబ్బర్సింగ్'తో సంచలనం సృష్టించి చరిత్రను తిరిగిరాశాడు. ఇలా మొదటి సినిమాతో విఫలమైనప్పటికీ తమ టాలెంట్తో పాటు కృషిని నమ్ముకొని ముందడుగు వేస్తూ సక్సెస్ బాటలో పయనిస్తున్నారు.







































