టీఆర్ఎస్లో చేరి తప్పు చేశానంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!!

కేసీఆర్ ఆకర్ష్ పథకానికి తెలంగాణలో మంచి స్పందన లభించింది. అటు కాంగ్రెస్ ఇటు టీడీపీనుంచి కూడా ఆ పార్టీలోకి పెద్దఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. అయితే ఇతర పార్టీల నాయకులకు పలు హామీలిచ్చి కేసీఆర్ టీర్ఎస్లోకి రప్పించుకుంటున్నారు. అలాగే ఖమ్మం జిల్లా వైరానుంచి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే మదన్లాల్ కూడా టీఆర్ఎస్లో చేరారు. అయితే పార్టీ మారినందుకు ఇప్పుడు ఆయన తెగ బాధపడిపోతున్నారు. స్థానికంగా టీఆర్ఎస్ నాయకుల నుంచి తనకు మద్దతు కరువైందని ఆయన వాపోతున్నారు. టీఆర్ఎస్లో చేరి వైసీపీని మోసం చేశారనన్న పేరుకుతోడు ఇప్పుడు ఇలా గులాబి నాయకులు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను పార్టీ మారి తప్పు చేశానని మీడియా సమక్షంలో ఆయన ప్రకటించడం అందర్ని విస్మయపరిచింది. అయితే తెలంగాణలో వైసీపీ, టీఆర్ఎస్ల దోస్తాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కావాలనుకుంటే ఆయన ఇప్పటికిప్పుడు కూడా మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోయినా కేసీఆర్ అభ్యంతరం తెలిపే అవకాశాలు తక్కువే. మరి అలాంటప్పుడు మదన్లాల్ దేని గురించి బాధపడుతున్నారో అర్థం కాకుండా ఉండదని ఖమ్మం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.








































