రెడ్డి మంత్రిపై చర్యలు తీసుకునే సాహసం చేస్తారా..??

పట్నం మహేందర్‌రెడ్డి.. తెలంగాణ రోడ్డు, రవాణాశాఖ మంత్రి. ఆయన భార్య సునీతారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్‌. ఆయన తమ్ముడు నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇలా  కుటుంబంలోని ప్రతిఒక్కరికి ఏదో ఒక పదవి ఉంది. ఇక గతంలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఈ పట్నం బ్రదర్స్‌ అనేక కబ్జాలకు పాల్పడినట్లు పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి ఓ పార్క్‌ను కబ్జా చేసి వెంచర్‌గా మార్చినట్లు ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అయితే డిప్యూటీ సీఎం రాజయ్య అవినీతికి పాల్పడ్డారంటూ పదవీచితుణ్ని చేసిన కేసీఆర్‌ ఇక ఇప్పుడు మహేందర్‌రెడ్డిపై ఎలాంటి చర్య తీసుకుంటారోనని అందరూ వేచిచూస్తున్నారు. ఈ కబ్జాకు సంబంధించి విచారణ జరుపుతారో లేక తేలికగా తీసుకుంటారోనని పార్టీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక మహేందర్‌రెడ్డి విషయంలో కేసీఆర్‌ ఉదాసీన వైఖరి అవలంబిస్తే ఆయనపై దళిత వ్యతిరేకిగా ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు ఎలాంటి అవకాశాన్ని వదులుకోవు. అంతేకాకుండా టీడీపీలో పలు పదవులు అనుభవించిన మహేందర్‌రెడ్డి ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక దీంతో టీడీపీ నాయకులు కూడా మహేందర్‌రెడ్డిని అంత తేలికగా వదిలిపెట్టే అవకాశాలు లేవు. మరి కేసీఆర్‌ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన క్యాబినెట్‌ మంత్రితో ఎలా వ్యవహరించనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

patnammahener reddy
nareder reddy
park occupied
kabja