ఢిల్లీ హైకోర్టులో జాన్వీ కపూర్కు ఊరట
Janhvi Kapoor Gets Relief from Delhi High Court
బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్కు ఢిల్లీ హైకోర్టు నుంచి కీలకమైన ఊరట లభించింది. ఇంటర్నెట్లో జాన్వీ పేరుతో .. ముఖంతో ప్రసారమవుతున్న అసభ్యకరమైన, మార్ఫింగ్ చేయబడిన నకిలీ కంటెంట్ను తొలగించాలని కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు జాన్వీ కపూర్కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇంటర్నెట్లోని దాదాపు 5000 పేజీల నుంచి అలాంటి అశ్లీల ..ఏఐ సృష్టికర్తల డీప్ఫేక్ కంటెంట్ను వెంటనే తొలగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు .. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు .. చిత్రాలను సృష్టించడం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల నటీమణుల వ్యక్తిగత గౌరవానికి, ప్రతిష్టకు తీవ్ర భంగం కలుగుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం గోప్యతను, వ్యక్తిగత హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కోర్టు తీసుకున్న సంచలన నిర్ణయం టెక్నాలజీ దుర్వినియోగానికి పాల్పడే సైబర్ నేరస్థులకు గట్టి హెచ్చరికలా నిలిచింది. ప్రముఖులపై వస్తున్న మార్ఫింగ్ ..ఏఐ ఫేక్ కంటెంట్పై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా డిజిటల్ వేదికలపై భయం ఏర్పడుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. హక్కుల కోసం న్యాయపోరాటం చేసి విజయం సాధించిన జాన్వీ కపూర్కు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.







































