ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shakapurushudu team at Balayya Birthday Celebrations

బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో శకపురుషుడు టీమ్

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిన్న రాత్రి హైదరాబాద్ ఐ. టి. సి. కోహినూర్ హోటల్ లో వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎన్. టి. ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. 

టి. డి. జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఎమ్. ఏ. షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అశ్విన్, అట్లూరి, కంఠంనేని రవిశంకర్, కాట్రగడ్డ ప్రసాద్, విక్రమ్ పూల, భగీరథ, అట్లూరి నారాయణ రావు, శ్రీపతి సతీష్, డి. రామ్ మోహన్ రావు, పారా అశోక్ కుమార్, రఘురాం కాసరనేని, సతీష్ మండవ, కె. వి. ఎస్. మధుసూదన రాజు సభ్యులుగా వున్నారు. 

ఈ కమిటీ ఏప్రిల్ 28న విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్. టి. ఆర్. ప్రసంగాలను శాసన సభ ప్రసంగాలు, చారిత్రిక  ప్రసంగాలు పేరుతో వెలువరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్ర బాబు నాయుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలకృష్ణ అతిధులుగా పాల్గొన్నారు. 

గత నెల 20న హైద్రాబాద్ లో నిర్వహించిన రెండవ కార్యక్రమంలో శకపురుషుడు, ప్రత్యేక సంచిక జై ఎన్.టి.ఆర్ వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ కమిటీ చేసిన కార్యక్రమాలు అనూహ్యమైన విజయవంత కావడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చాయి. అందుకే బాలకృష్ణ తన జన్మ దిన వేడుకలకు ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీని ఆహ్వానించారు. 

ఈ జన్మదినోత్సవ వేడుకల్లో కమిటీ చైర్మన్ టి. డి. జనార్దన్ బాలకృష్ణను శాలువాతో సత్కరించారు. తరువాత సభ్యుల ఆనందోత్సాహాల మధ్య బాలకృష్ణ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా భగీరథ, విక్రమ్ పూల శకపురుషుడు ప్రత్యేక సంచికను బాలకృష్ణకు బహుకరించారు . పారా అశోక్ కుమార్ నందమూరి వంశ వృక్షం చిత్ర పటాన్ని, బాలకృష్ణ చిత్ర పటాన్ని విజయ్ బహుకరించారు. ఇదే రోజు పుట్టిన రావుల చంద్ర శేఖర్ రెడ్డి, అట్లూరి నారాయణ రావు ను బాల కృష్ణ శాలువాలతో సత్కరించారు. 

తన తండ్రి నందమూరి తారక రామారావు గారి శత దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించిన కమిటీని బాలకృష్ణ అభినందించి అందరికీ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో నందమూరి రామకృష్ణ, మాగంటి మురళీ మోహన్ కూడా పాల్గొన్నారు.

Balakrishna birthday celebrations

Shakapurushudu team at Balayya Birthday Celebrations
balakrishna
shakapurushudu