లైకా ప్రొడక్షన్స్ స్ట్రయిట్ తెలుగు సినిమా

ఐశ్వర్య ఆర్. ధనుష్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ స్ట్రయిట్ తెలుగు సినిమా
భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా.. రజనీకాంత్, అక్షయ్కుమార్ నటించిన 2.0ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అదొక్కటే కాదు. ఇంకా పలు భారీ బడ్జెట్, హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న రామ్ సేతు తో హిందీ పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. జాన్వీ కపూర్ కథానాయికగా గుడ్ లక్ జెర్రీ నిర్మిస్తోంది. హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మిస్తోంది. ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా చేయడానికి లైకా ప్రొడక్షన్స్ సిద్ధమైంది.
సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె, హీరో ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు సుభాస్కరన్, మహవీర్ జైన్ స్ట్రయిట్ తెలుగు సినిమా నిర్మించనున్నారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా 3 తో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత వెయ్ రాజా వెయ్ చేశారు. ఇప్పుడు దర్శకురాలిగా మూడో సినిమా, తెలుగులో చేయడానికి ఐశ్వర్య ఆర్. ధనుష్ సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా ఐశ్వర్య ఆర్. ధనుష్ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాను. పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది అని చెప్పారు. లైకా ప్రొడక్షన్స్ సీఈవో ఆశిష్ సింగ్ మాట్లాడుతూ మా సంస్థలో తొలి స్ట్రయిట్ తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండటం మాకెంతో ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకుంది అని చెప్పారు. సినిమాలో నటీనటులు, పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Lyca Productions to bankroll a straight Telugu film with Aishwaryaa R Dhanush as director
Lyca Productions to bankroll a straight Telugu film







































