టాలీవుడ్-కోలీవుడ్ లో మురుగన్ వివాదం!

Tollywood vs Kollywood

టాలీవుడ్- కోలీవుడ్ పరిశ్రమల మధ్య  `మురుగన్` (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యం చుట్టూ ఆసక్తికరమైన వివాదం నడుస్తోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో ఓ భారీ చిత్రం ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.  అలాగే కోలీవుడ్‌లో ధనుష్-వెట్రిమారన్ ద్వయం `మురుగన్` పేరుతో  మ‌రో చిత్రాన్ని ప్రకటిం చడం రెండు పరిశ్రమల్లోనూ చర్చకు దారితీసింది. దైవిక అంశాలను కథాంశంగా తీసుకున్నప్పుడు వచ్చే ఈ విధమైన పోటీ తెలుగు - తమిళ సినీ ప్రేక్షకుల్లో  ఆసక్తిని రేకెత్తిస్తోంది.

త్రివిక్రమ్ తనదైన శైలిలో సుబ్రహ్మణ్య స్వామి పురాణ గాథలను, కుటుంబ విలువలతో జోడించి తెరపైకి తీసుకురావాలని చూస్తుంటే.. వెట్రిమారన్ తన మార్కు వాస్తవికతతో మురుగన్ భక్తిని  లోతును ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. దేవుడి పేరును  ఉపయోగించుకునే క్రమంలో ప్రాంతీయ సెంటిమెంట్లు .. సాంస్కృతిక భిన్నత్వం  ప్రాజెక్టుల చుట్టూ రచ్చను పెంచుతున్నాయి. దీంతో ఏ చిత్రం ఏ కోణంలో కథను చూపిస్తుందనేది సినీ అభిమానులకు  ప్రశ్నగా మారింది. ఒకే  నేపథ్యంతో వస్తున్న  రెండు భారీ చిత్రాల మధ్య పోలికలు రావడం సహజం. అయితే క్రియేటివ్ స్వేచ్ఛ .. మతపరమైన సున్నితత్వం మధ్య  ద‌ర్శ‌కులిద్ద‌రు ఎలా సమతుల్యత పాటిస్తారనేది అతిపెద్ద ప్రశ్న.

రెండు సినిమాలు ఏ విధమైన కళాత్మక విలువలను ప్రదర్శిస్తాయనేదే ప్రేక్షకులకు కీలకం. ఎన్టీఆర్ గెటప్ .. త్రివిక్రమ్ మేకింగ్ ఒక ఎత్తు అయితే? ధనుష్-వెట్రిమారన్ల  మురుగన్ మరో ఎత్తు. ఏ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తుంది? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. వివాదాల కన్నా? అద్భుతమైన కథాంశం , నటన ద్వారా  రెండు చిత్రాలు ఎలా ప్రేక్షకులను అల‌రిస్తాయో చూడాలి.