ప్రముఖ నటుడు కన్నుమూత!
Actor Salim Kumar passes awayమలయాళ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అద్భుతమైన నటనతో, హాస్యంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు, కమెడియన్ సలీమ్ కుమార్ (56) శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా వంశపారంపర్యంగా వస్తున్న కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, కేరళ కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సలీం మరణవార్త తెలియగానే మలయాళ సినీ లోకంతో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని తెలిపారు.
సలీమ్ కుమార్ సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. కేరళలోని ప్రముఖ `కళాభవన్` సంస్థ ద్వారా మిమిక్రీ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆయన అటుపై టెలివిజన్ కామెడీ షోల ద్వారా బుల్లితెర వీక్షకులకు బాగా దగ్గరయ్యారు. 1997లో వెండితెరకు పరిచయమై తనదైన టైమింగ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో మలయాళ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి కమెడియన్గా మారారు. కేవలం నవ్వులు పూయించడమే కాదు. సీరియస్ భావోద్వే గపూరితమైన పాత్రలను కూడా అంతే అద్భుతంగా పండించగలనని నిరూపించుకుని వర్సటైల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం `ఆదామింతె మకన్ అబు` (2010). ఈ సినిమాలో ఒక ముస్లిం వృద్ధుడిగా ఆయన కనబరిచిన నటనకు గాను ప్రతిష్టాత్మక `జాతీయ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టి దేశంలోనే అత్యున్నత నటన పురస్కారాన్ని అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్గా కూడా చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన సలీమ్ కుమార్ మరణం మాలీవుడ్కు తీరని లోటు.







































