3 ఇడియట్స్ సీక్వెల్పై ఇంట్రెస్టింగ్ అప్టేడ్

బాలీవుడ్ సంచలన హిట్ `3 ఇడియట్స్` కు సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరాణీ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కొన్ని బయటకు వచ్చాయి. ప్రస్తుతం రాజ్కుమార్ హిరానీ సీక్వెల్ కథపై కసరత్తు చేస్తున్నారని ఇప్పటికే తాను ఆ కథను విని ఫిదా అయ్యానని అమీర్ పేర్కొన్నారు. తొలి భాగంలో ఉన్న హ్యూమర్ - ఎమోషన్ ఏమాత్రం తగ్గకుండా ఈ రెండో భాగం ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సీక్వెల్ కథలో మరో ఆసక్తికర మలుపు ఏమిటంటే? ఇందులో టైమ్ జంప్ ఉండబోతోంది. మొదటి భాగం ముగిసిన పదేళ్ల తర్వాత ఆ ముగ్గురు స్నేహితుల జీవితాలు ఎలా మారాయి? అనే కోణంలో కథ సాగనుందిట. ఈ చిత్రంలో అమీర్ ఖాన్తో పాటు ఒరిజినల్ స్టార్ కాస్ట్ అయిన ఆర్. మాధవన్ , షర్మన్ జోషిలు కూడా తిరిగి తమ పాత్రలను పోషించబోతున్నారు. ఫున్సుక్ వాంగ్డు, ఫర్హాన్, రాజుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధం మళ్ళీ వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. `3 ఇడియట్స్` సీక్వెల్ అనేది సినిమా మాత్రమే కాదు. అదొక ఎమోషన్. నేటి మారుతోన్న విద్యా విధానం , కెరీర్ ఒత్తిళ్ల నేపథ్యంలో ముగ్గురు స్నేహితులు మళ్ళీ ఎలాంటి సందేశాన్ని ఇస్తారో? చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విక్కీ కౌశల్ వంటి నటులు కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతారనే ఊహాగానాలొస్తున్నాయి.








































