జగన్ ఓదార్పు యాత్ర మొదలు!
Jagan consolation journey begins!వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలుపెట్టినట్టేనా..? వినుకొండ నుంచి యాత్ర షురూ అయ్యిందా..? ఇక వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఎక్కడేం జరిగినా వాలిపోవాలని అధినేత భావిస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ జగన్ ఇంత సడన్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు..? ఆయనలో ఈ మార్పు అందరూ ఆశించనదేనా..? లేకుంటే మరేదైనా జరిగిందా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
ఇదీ అసలు కథ..!
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే వైసీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ఆఫీసులు.. ప్రభుత్వ కార్యాలయాలపై ఏ రేంజిలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు విరుచుకుపడుతున్నారన్నది ఆ పార్టీ నేతల ప్రధాన ఆరోపణ. నాడు మొదలైన ఈ ఘటనలు నేటి వరకూ నాన్ స్టాప్గా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉన్నాయని.. దాడుల్లో గాయపడిన, పార్టీ ఓడిపోయిందని తీవ్ర ఆవేదనకు లోనవుతున్న అభిమానులు, కార్యకర్తలు.. నేతలను పరామర్శించి, వారిని ఓదార్చడానికి రంగంలోకి దిగిపోయారు జగన్. ఇందులో భాగంగానే యాత్ర వినుకొండ నుంచి షురూ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంత మార్పా..?
ఏపీలో తొలుత దాడులు జరుగుతున్న సమయంలో కార్యకర్తలను కాపాడే దిక్కేలేరు..? జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్లో నిద్రలో జోగుతున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. వినుకొండలో నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్తను, టీడీపీ కార్యకర్తలు వేటాడి చంపిన ఘటనతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది. దీంతో ఇకనైనా కదిలిరా.. 2014-2019లో ఉన్న జగన్ స్వరూపాన్ని చూపించు అంటూ సొంత కార్యకర్తలు, నేతలు ఒక్కటే విమర్శలు గుప్పించారు. దీంతో దెబ్బకు జగన్ దిగొచ్చారన్నది ఆ పార్టీ వాళ్లే చెబుతున్నారు. సో.. ఇక నుంచి కార్యకర్తలు, నేతలకు ఎక్కడ ఏం కష్టం వచ్చినా సరే వాలిపోతారట. ఇలా కార్యకర్తలను కాపాడుకుంటూనే.. కూటమి ఇచ్చిన హామీలు అమలుకై పోరాటాలకు దిగుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైతేనేం మార్పు మంచిదే జగన్ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో.. మున్ముందు జగన్ ఏం చేయబోతున్నారో.. ఆయన ప్లానేంటో చూడాలి మరి.
Jagan In To People With Consolation Trip?







































