చంద్రబాబు బయోపిక్ ఎంత వరకు వచ్చిందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘చంద్రోదయం’. ఈ బయోపిక్ను పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ పూర్తయింది. ఇటివలే ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబునాయుడుని కలిసింది చిత్రయూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. ‘‘ఆకులు ఎన్ని కాల్చినా బొగ్గులు కావు బ్రదర్. జిత్తులమారి నక్కలు, తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు, మృగరాజు నా అల్లుడే’ అనే ఎన్టీఆర్ క్యారెక్టర్ డైలాగ్తో చిత్ర షూటింగ్ విజయవాడలో పూర్తయింది. చంద్రబాబు నాయుడు.. దేశ చరిత్రలోనే ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన జీవితం అందరికీ తెలియ చెప్పాలనే సంకల్పంతో ఈ బయోపిక్ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ పూర్తిచేశాము. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన స్థాయికి చేరిన ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా తెరమీదకు తీసుకువస్తున్నాము..’’ అన్నారు.
నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘నారావారి పల్లె, హైదరాబాద్, అమరావతి, సింగపూర్ లోని లొకేషన్స్లో సినిమా షూటింగ్ చేశాము. మహా నాయకుడి బయోపిక్ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. పాటలను నవంబర్ 2వ వారంలో విడుదల చేస్తాము. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అన్నారు.
వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక, భాస్కర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశెట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.
Chandrodayam Movie Shooting Completed
Chandrodayam Movie Team Meets AP CM Chandrababu Naidu



































