సితార చేతుల్లో ‘తారలు దిగివచ్చిన వేళ’..!
Sammohanam Book Launch by Mega Star Chiranjeeviసుధీర్బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన 'సమ్మోహనం' చిత్రం క్లైమాక్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో తనికెళ్ల భరణి 'తారలు దిగి వచ్చిన వేళ' అంటూ.. అందులోని ఓ బుజ్జి కథను చదువుతారు. బుజ్జి కథలో సినిమా కథ అంతర్లీనంగా ఉంటుంది. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి 'తారలు దిగి వచ్చిన వేళ' పుస్తకం కాన్సెప్ట్ బావుందని పలువురు మెచ్చుకుంటున్నారు. ఆ పుస్తకం కాపీ కావాలని ఇంకొందరు చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిని అడిగారు. దాంతో మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ విషయాన్ని ఆలోచించారు. క్లైమాక్స్ లో చూపించిన పుస్తకాన్ని ప్రచురించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణికి ఓ ప్రచురణ సంస్థ ఉంటుంది... 'అనగనగా' అని. అదే పేరుతో మోహనకృష్ణ ఇంద్రగంటి కూడా ఓ ప్రచురణ సంస్థను మొదలుపెట్టి తొలి ప్రచురణగా 'తారలు దిగి వచ్చిన వేళ'ను ప్రచురించారు. ఆ మధ్య ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
తాజాగా ఈ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. తొలి కాపీని టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ తనయ సితార అందుకున్నారు. ఈ పుస్తకం గురించి మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ 'తారలు దిగివచ్చిన వేళ'... 'సమ్మోహనం' చిత్ర పతాక సన్నివేశాలు ఎలా ఉండాలా? అని మథన పడుతుండగా వచ్చిన ఆలోచన. సినిమా రంగం పట్ల చిన్నచూపు ఉన్న చిత్రకారుడు, అనుకోకుండా ఆ రంగానికే చెందిన ఒక నటిని ముందు గాఢంగా ప్రేమించి, తరువాత అనాలోచితంగా ద్వేషించి, చివరికి తన పొరపాటు గ్రహించి ఆ అమ్మాయిని తిరిగి పొందే క్రమంలో ఆ అనుభవసారాన్ని ఒక చిన్నపిల్లల కథలా రాస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనకి రూపమే ఈ పుస్తకం. ఓ పక్క ఒక ఊహాజనిత అనుభవానికి అక్షర, చిత్ర రూపం ఇస్తూనే, అంతర్లీనంగా తన వ్యక్తిగత ప్రేమానుభవాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తాడు ఈ చిత్ర కథానాయకుడు.
ఈ కథని తనికెళ్ల భరణిగారు చదివిన విధానం, దానికి ప్రముఖ చిత్రకారుడు చారి పి.యస్.గారు వేసిన అద్భుతమైన బొమ్మలు 'సమ్మోహనం' చిత్ర పతాక సన్నివేశంలోని నటన, గతి, సంగీతం, కళా దర్శకత్వం, ఛాయాగ్రహణాలకి దిశానిర్దేశం చేశాయి. ఈ కథ, బొమ్మలూ చిన్న పిల్లలకీ, పెద్దలకీ బాగా నచ్చుతాయనే నమ్మకంతో పుస్తకంగా అందిస్తున్నాను... అని అన్నారు.
Mahesh Babu's daughter Sitara Receives Mohan Krishna Indraganti's ''Taralu Digi Vachina Vela'' Book







































