డెసిషన్‌ పవన్‌ది.. బెనిఫిట్‌ చంద్రబాబుకి!

నిన్నటి తమిళనాడు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి అధికారం కైవసం చేసుకున్న జయలలిత అన్నాడిఎంకే పార్టీకి, కరుణానిధి డిఎంకే పార్టీకి సీట్ల సంఖ్యలో చాలా తేడా ఉన్నప్పటికీ ఓట్ల శాతంలో మాత్రం కేవలం 1.5శాతమే తేడా. వాస్తవానికి ఈ ఎన్నికల్లో డిఎంకేకు అనుకూలంగా విజయ్‌కాంత్‌ నేతృత్వంలోని డీడీఎంకే పార్టీ పొత్తుపెట్టుకొని ఉంటే విజయం డీఎంకేను వరించి కరుణానిధి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినప్పటికీ విజయ్‌కాంత్‌ పార్టీ సాధించుకున్న ఓట్ల శాతం 2.5 శాతం. ఇక విజయ్‌కాంత్‌ ఇలా జయలలిత ప్రభుత్వపు వ్యతిరేక ఓట్లను మూకుమ్మడిగా కరుణానిధికి పడకుండా ఓట్లను చీల్చివేశాడు. తానే కాదు.. విజయ్‌కాంత్‌ తనలాంటి చిన్న చిన్న పార్టీలను ఐక్యం చేసి పోటీ చేశాడు. ఇదే జయలలితకు వరమైంది. మరోపక్క కరుణానిధి తన పెద్ద కుమారుడు అళగిరిని దూరం పెట్టడం, కరుణానిధి శిష్యుడైన వైగో వంటి వారు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం వంటివి డిఎంకేకు శాపంగా మారాయి. 

కాబట్టి 2019లో జరిగే ఎన్నికల్లో కూడా ఏపీలో పవన్‌కళ్యాణ్‌ జనసేనను చంద్రబాబు పట్టించుకోకపోతే ఖచ్చితంగా పవన్‌ ఒంటరిగానే పోటీ చేస్తాడు. లేదా తనకు నచ్చిన లోక్‌సత్తా, వామపక్షాల సహాయంతో గానీ లేదా బిజెపితో మిత్రపక్షంగా అయినా పోటీ చేయకతప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది.పవన్‌ వైయస్సార్‌సీపీతో కాకుండా ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా అది బాబుకు వరమే అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైయస్సార్‌సీపీ, పవన్‌ల మధ్య చీలిపోయి బాబుకు లబ్ది చేకూరుతుంది. ఇదే ఆలోచనలో బాబు కూడా ఉన్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. తమిళనాడులో విజయ్‌కాంత్‌ పోషించిన పాత్రను ఏపీలో పవన్‌ పోషిస్తే అది చంద్రబాబుకు వరంగా మారుతుంది...!

pawan kalyan
decision
chandrababu
benefit
karunanidhi
jayalalitha
vijay kanth