పండగ రారాజు ఎవరో తెలిసిపోయింది..!

ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో నాలుగు సినిమాలు పోటీపడి విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నాన్నకు ప్రేమతో', బాలకృష్ణ హీరోగా నటించిన 'డిక్టేటర్', నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా', శర్వానంద్ నటించిన 'ఎక్స్ప్రెస్రాజా' చిత్రాలు విడుదలయ్యాయి. విడుదలైన ఈ నాలుగు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అయితే ఈ సంక్రాంతి రేసులో రారాజుగా నిలచేది బాలయ్య లేదా ఎన్టీఆర్ అని ముందు నుండి అందరూ అంచనా వేశారు. అందుకు భిన్నంగా ఈ ఇద్దరినీ బీట్ చేసి నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం ముందుంది. అటు ప్రేక్షకుల స్పందనపరంగా, విమర్శకుల రివ్యూలపరంగా టాప్ రేటింగ్ నాగ్ సినిమాకే దక్కింది. దీంతో ఈ సంక్రాంతి రారాజు నాగార్జునే అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. 'మనం' సినిమా తర్వాత నాగ్ మరలా తన సొంతబేనర్లో ఆస్థాయి విజయం అందుకోవడంపై అక్కినేని అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా ఎఫెక్ట్తో ఆయన తర్వాత సినిమా 'ఊపిరి'పై అంచనాలు భారీగా పెరిగాయి.







































