దూసుకుపోతున్న రామ్‌చరణ్‌..!

వరుసగా 'గోవిందుడు అందరివాడేలే', 'బ్రూస్‌లీ' చిత్రాలతో ప్రేక్షకులనే కాదు.. తన వీరాభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయిన రామ్‌చరణ్‌ వెకేషన్స్‌ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఊరికే ఎంజాయ్‌మెంట్‌కే పరిమితం కాకుండా తాను చేయబోయే చిత్రాల విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నాడని సమాచారం. అక్కడి నుండే ఆయన పని చేస్తున్నాడు. వరుసగా చిత్రాలు చేయాలని, గ్యాప్‌ లేకుండా చూసుకోవాలని భావిస్తున్న ఆయన తన రెండేళ్ల డైరీని ఫుల్‌ చేసుకునే పనిలో పడ్డాడు. ఇలా దూసుకుపోవాలని భావిస్తున్న ఆయన వరుస చిత్రాలను ఓకే చేయడం విశేషం. కాగా ఆయన తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇచ్చాడని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇక నుండి ఏడాదికి రెండు సినిమాల విషయాన్ని ఆయన ఆచరణలో పెట్టాలనే కీలకనిర్ణయం తీసుకున్నాడు. అమెరికా నుండి రాగానే తమిళ రీమేక్‌ 'తని ఒరువన్‌' చిత్రాన్ని సురేందర్‌రెడ్డితో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన తమిళ స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌మీనన్‌తో ఎప్పటినుండో అనుకుంటున్న ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. వచ్చే ఏడాది చివరిలోపు తన బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ నిర్మాతగా చేయనున్న చిత్రాన్ని మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నాడు. కాగా ఈ చిత్రం డైరెక్టర్‌ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బహుశా ఈ విషయంలో పవన్‌ త్రివిక్రమ్‌ను ఒప్పించి డైరెక్షన్‌ చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

ఇక చరణ్‌ తీసుకున్న మరో కీలక నిర్ణయం ఇప్పుడు అందరికి ఆసక్తిని కలిగిస్తోంది. యు.వి. క్రియేషన్స్‌ బేనర్‌లో ఆయన త్వరలో ఓ చిత్రం చేయనున్నాడట. ఈ చిత్రానికి 'జిల్‌' దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. 'జిల్‌' చిత్రం కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ కాకపోయినప్పటికీ అందులో దర్శకుడు రాధాకృష్ణ టేకింగ్‌, గోపీచంద్‌ను ఆయన చూపించిన విధానం బాగా నచ్చడంతో ఆయన రాధాకృష్ణకు చాన్స్‌ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. గతంలో 'రచ్చ' సినిమాకు సంపత్‌నందిని డైరెక్టర్‌గా పెట్టుకొని మంచి ఫలితాన్నే పొందిన రామ్‌చరణ్‌ దర్శకునిగా రాధాకృష్ణకు అలాంటి అద్భుతమైన అవకాశమే ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాడట. 

ram charan
brucelee
thani oruvan remake
jil director radhakrishna