'మా' ఎన్నికల ఫలితాలను వీడని గ్రహణం..!!

'మా' ఎన్నికల ఫలితాల వెల్లడికి గ్రహణం వీడటం లేదు. నటుడు కల్యాణ్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేస్తూ 'మా' ఎన్నికల ఫలితాలను వెల్లడించవచ్చని సిటీ సివిల్‌ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల ఫలితాలు బయటకు వస్తాయని అందరూ ఆశించారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా కల్యాణ్‌ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 'మా' ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఇదివరకే కోర్టు సమయం వృథా చేశాడంటూ కల్యాణ్‌కు సివిల్‌ కోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. అయినా ఆయన వైఖరిలో ఏమాత్రం మార్పురాలేదు. ఇక హైకోర్టులో ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకు 'మా' ఎన్నికల ఫలితాలను విడుదల చేయడం కష్టమే. ఈ పరిణామంపై టాలీవుడ్‌ వర్గాలు మళ్లీ నిరాశకు లోనయ్యాయి. ఈసారి కూడా సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పే రిపీట్‌ అవుతుందని, అంతేకాకుండా ఈసారి కల్యాణ్‌కు జరిమానా కూడా భారీగా విధిస్తారని జయసుధ వర్గం నాయకులు విమర్శిస్తున్నారు.

maa elections
high court
kalyan