సోనియాగాంధీ ఏపీకి వస్తే..??

సోనియాగాంధీకి ఒకప్పుడు తెలుగు ప్రజలు నీరాజనం పట్టారు. అయితే ప్రస్తుతం తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికే ఆమె కారణం కావడంతో సీమాంధ్రలో ప్రస్తుతం ఆమె విలన్‌గా మారిపోయారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్‌ ఏపీలో తన అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. దీంతో ఆ పార్టీని పటిష్ట పర్చడానికి కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి పడరాని పాట్లు పడుతున్నారు. క్రమం తప్పకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న ఆ మీటింగ్‌లకు ప్రజలతోపాటు నాయకులు కూడా కరువయ్యారు. దీంతో ఏకంగా సోనియాగాంధీనే రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ మాసంలో సోనియా ఏపీలో పర్యటిస్తారని సమాచారం. అంతలోపు పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసి ప్రజల మద్దతు పొందడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఏపీకి తాము భారీ ప్యాకేజీలు ప్రకటించినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ అటు బీజేపీ ఇటు టీడీపీలను ఇరుకున పెట్టాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరి రఘువీరా ఎత్తుగడ ఎంతవరకు పనిచేస్తుందో వేచిచూడాలి..!

sonia gandhi
ap tour
specialstatus
raghuveera reddy