స్నేహితులుగా ఎంటరై..ఫ్యామిలీ మెంబర్లలా!
PV Sindhu Finds a New Family in Nayanthara and Vignesh
బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఇటీవల సూపర్ స్టార్ నయనతార - ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులను కలిశారు. చెన్నైలోని తమ నివాసంలో నయనతార-విఘ్నేష్ జంట పీవీ సింధు, ఆమె భర్త వెంకట దత్త సాయికి ప్రత్యేకంగా ఆతిథ్యమిస్తూ అదిరిపోయే డిన్నర్ విందును ఏర్పాటు చేశారు. క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖుల ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెట్టింట వైరల్గా మారాయి.
ఈ ప్రత్యేక సాయంత్రం గురించి పీవీ సింధు ఎంతో భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. `రుచికరమైన ఆహారం, హృదయపూర్వక సంభాషణలు, ముగింపు లేని నవ్వులతో ఈ సాయంత్రం ఎంతో అద్భుతంగా సాగింది. మేం కేవలం స్నేహితులుగా వారి ఇంట్లోకి అడుగుపెట్టాం. కానీ జీవితం, ప్రేమ గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాక ఎప్పటి నుంచో పరిచయం ఉన్న సొంత కుటుంబ సభ్యుల్లా బయటకు వచ్చాం` అని రాసుకొచ్చారు. చెన్నైలో నా కోసం మరికొంతమంది సొంత కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారనే భావన కలిగిందంటూ నయన్, విక్కీల మంచి మనసును కొనియాడారు.
పీవీ సింధు చేసిన ఆత్మీయ పోస్ట్పై నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు కూడా వెంటనే స్పందించారు. నయనతార కామెంట్ సెక్షన్లో.. `మీ ఇద్దరికీ ఎల్లప్పుడూ నా ప్రేమ మాత్రమే ఉంటుంది` అని బదులివ్వగా, విఘ్నేష్ శివన్ స్పందిస్తూ.. `మీ మాటలు చాలా తియ్యగా ఉన్నాయి. మా ప్రేమను తెలియజేస్తున్నాం` అని ఆప్యాయంగా బదులిచ్చారు. వీరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు చూసి నెటిజన్లు కూడా మురిసిపోతున్నారు.







































