బంగారం` స్కిప్ కొట్టినా `వీరభద్రుడు` బరిలోకి

టాలీవుడ్లో ప్రస్తుతం ఎగ్జిబిటర్లు- నిర్మాతల మధ్య థియేట్రికల్ లాభాల్లో పర్సంటేజీ షేరింగ్ విషయంలో తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ సంక్షోభాన్ని ముందే పసిగట్టిన సమంత తన తాజా చిత్రం `మా ఇంటి బంగారం` విడుదలను మే 14 నుండి జూన్ 19కి వాయిదా వేసి ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో ఉన్న మంచి రిలీజ్ విండోను వదులుకుంటున్నారని మొదట్లో అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినా కానీ.. మునుముందు పరిస్థితులలో థియేటర్ల సమస్యల వల్ల వసూళ్లు దెబ్బతినకుండా ఉండేందుకు సమంత టీమ్ తీసుకున్న ఈ `నష్ట నివారణ` చర్య ఇప్పుడు సరైనదేననిపిస్తోంది. ఈ వివాదం త్వరగా తేలేలా కనిపించకపోవడంతో రిస్క్ తీసుకోవడం కంటే వేచి చూడటమే ఉత్తమమని `....బంగారం` టీమ్ భావించింది.
అయితే ఒకవైపు ఈ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకుండానే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం గమనార్హం. సూర్య నటించిన `వీరభద్రుడు`, `కేడీ ది డెవిల్` వంటి డబ్బింగ్ చిత్రాలు ఈ వివాదం మధ్యలోనే యథావిధిగా థియేటర్లలో విడుదలైపోతున్నాయి. వీరితో పాటు మే 24 లోపు దృశ్యం 3, అగ్లీ స్టోరీ వంటి దాదాపు అరడజను సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ ఎగ్జిబిటర్లు అనూహ్యంగా ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే ఈ రన్నింగ్ సినిమాల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. ఈ సినిమాల మేకర్లు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో ప్రేక్షకుల స్పందనే తేల్చాలి.







































