అపరిచితుడు రీమేక్ ఆపేశారు

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించాలనుకున్న అపరిచితుడు రీమేక్ చిత్రం ఆదిలోనే ఆగిపోయింది. ఈ విషయం స్వయంగా దర్శకుడు శంకరే తెలిపారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్రయూనిట్ మొత్తం సినిమా ప్రమోషన్స్‌లో నిమగ్నమైంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా శంకర్ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు.

ఈ మీడియా సమావేశంలో అపరిచితుడు రీమేక్ ముచ్చట రాగా.. ఆ సినిమాను ఆపేసినట్లుగా శంకర్ చెప్పుకొచ్చారు. దీనికి కారణం చెబుతూ.. అపరిచితుడు రీమేక్ చేసే కంటే, అంతకంటే భారీ చిత్రం తీయడం మంచిదని నిర్మాత జయంతిలాల్ గడ నాతో అన్నారు. నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే, అపరిచితుడు తర్వాత కొత్త కాన్సెప్ట్‌లతో పలు పాన్ ఇండియా సినిమాలు వచ్చి, మంచి విజయం సాధించాయి. మళ్లీ అదే సినిమా అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని.. నిర్మాత వద్దనుకున్నారు. ప్రస్తుతం ఆ సినిమాని పక్కన పెట్టేశాం. ప్రస్తుతం నా చేతిలో ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా గురించి ఆలోచిస్తాం.. అని శంకర్ తెలిపారు. 

శంకర్ భారతీయుడు 2 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా భారతీయుడు‌కి సీక్వెల్‌గా తెరకెక్కింది. సేనాపతి మళ్లీ వస్తే కాన్సెప్ట్‌తో ఈసారి భారీగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. భారతీయుడు 2నే కాదు భారతీయుడు 3 కూడా ఉంటుందని శంకర్ ఇదే ఇంటర్వ్యూలో మరోసారి వెల్లడించారు.

Director Shankar About Aparichitudu Bollywood Remake

Aparichitudu Bollywood Remake Stopped
shankar aparichitudu