కింగ్ నాగ్ ఆవిష్కరించిన ‘నిన్నే పెళ్లాడతా’ లోగో!
Nagarjuna Launches Ninne Pelladatha Movie First Lookగతంలో కింగ్ నాగార్జున, టబు నటించిన ‘‘నిన్నే పెళ్లాడతా’’ చిత్రం సూపర్ హిట్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం విదితమే. అదే టైటిల్తో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర లోగోని కింగ్ అక్కినేని నాగార్జున గురువారం హైదరాబాద్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వైకుంఠ లవ్య మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర లోగోని ఆవిష్కరించిన మా మన్మథుడు, కింగ్ నాగార్జునగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆయన హిట్ చిత్రo ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్ను, ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మాకు సంతోషంగా ఉంది. అమన్, సిద్ధిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, సీత, ఇంద్రజ, సిజ్జు, అన్నపూర్ణమ్మ, మధునందన్ మిగతా పాత్రలు పోషించారు. ఇప్పటికే 50 శాతంకు పైగా షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 2 నుంచి వైజాగ్లో చివరి షెడ్యూల్ ప్రారంభించుకుని, అక్టోబర్లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘నిన్నే పెళ్లాడతా ఫస్ట్ లుక్ని కింగ్ నాగార్జునగారు ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉంది. కొత్త వారిమైన మమ్మల్ని పెద్దమనసుతో ఆశీర్వదించినందుకు నాగార్జునగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే డైరెక్టర్ బోను చెప్పిన కథ చాలా వెరైటీగా వుంది. హీరోహీరోయిన్స్లతో పాటు సీనియర్ ఆర్టిస్టులందరు చాలా చక్కగా నటిస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్ తర్వాత కులుమనాలిలో పాటల చిత్రీకరణ జరపనున్నాం అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: నవనీత్, ఎడిటర్: అనకాల లోకేష్, ఫైట్స్: రామకృష్ణ, సహా నిర్మాత: సాయికిరణ్ కొనేరి, నిర్మాతలు: బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: వైకుంఠ బోను.
Ninne Pelladatha Movie Logo and First Look Launched by King Nagarjuna






































