మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు లేనట్టేనా..!

నిన్న హైద్రాబాద్ లోని శిల్పకళా వేదికలో 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ పంచెకట్టుతో వచ్చి సెంటర్ఆఫ్అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే ఈ ఈవెంట్ కి కేవలం పవన్ కళ్యణ్ మాత్రమే గెస్ట్. మిగతా మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరూ ఈ 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేదు. కారణం ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్ గాని హీరో పవన్ కళ్యాణ్ గాని వారెవరిని ఆహ్వానించకపోవడమే.
అసలు ఆ మధ్యన 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రామ్ చరణ్ స్వయంగా పవన్ ని పిలిచినా పవన్ ఆ ఈవెంట్ కి హాజరవకుండా దూరంగా ఉండిపోయి కేవలం ఒక ట్వీట్ తో 'ఖైదీ...' చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకున్నాడు. ఇక ఈ 'కాటమరాయుడు' ఈవెంట్ కి హాజరవకపోయినా పవన్ అన్న చిరు కొడుకు రామ్ చరణ్ మాత్రం బాబాయ్ సినిమా సక్సెస్ సాధించాలని మెసేజ్ పంపాడు. తన సోషల్ మీడియా పేజీ లో 'కాటమరాయుడు' ట్రైలర్ యూట్యూబ్ లింక్ ని షేర్ చేసిన చరణ్ 'పవర్ ప్యాక్డ్ పండగలా అనిపిస్తోంది. మార్చి 24న థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు మన అందరి కాటమరాయుడు' అంటూ పోస్ట్ పెట్టాడు.
ఈవెంట్ కి పిలవకపోయినా తన బాబాయ్ సినిమా సక్సెస్ సాధించాలని రామ్ చరణ్ మనస్ఫూర్తిగా కోరుకుని వారి మధ్యన విభేదాలకు తావు లేదని మరోసారి చెప్పకనే చెప్పాడు. అలాగే పవన్ కూడా 'కాటమరాయుడు' ఈవెంట్ లో తన అన్న చిరంజీవి మాత్రమే హీరో అని చెప్పి మెగా ఫ్యాన్స్ అంతర్గత కలహాలకు తెరదించాడు.







































