అల్లు వారబ్బాయి ప్రేక్షకులను వదిలేలా లేడు..!

తన మొదటి రెండు చిత్రాలైన 'గౌరవం, కొత్తజంట' చిత్రాలతో బాబోయ్‌.. అనిపించుకున్న అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌ తన ఫేస్‌ను, నటనను ప్రేక్షకులకు నచ్చేలా చేసేదాకా వదిలేలా కనిపించడం లేదు. సాక్షాత్తూ మెగాస్టార్‌ చిరంజీవిని 'ఇంద్ర' విజయవాడ వేడుకలో ఆకాశానికి ఎత్తేసిన ప్రకాష్‌రాజ్‌ను ఇటీవల చిరు ఏకంగా ఎస్వీరంగారావుతో పోల్చాడు. మరి వారిమద్య ఇంత అనుబంధం కారణంగానే ఈ హీరోలో ఏమి చూసి 'గౌరవం' చిత్రంతో ప్రకాష్‌రాజ్‌ ప్రేక్షకులకు పరిచయం చేశాడో అందరికీ బాగా అర్ధమైపోయింది. ఎలాగూ మెగాభిమానుల ప్రోత్సాహం, తండ్రి, సోదరుల అండ, సాక్షాత్తూ మెగాస్టారే అల్లు శిరీష్‌ ఫేస్‌లోని గ్రేస్‌ గురించి పొగడ్తలు గుప్పించడం ఎవ్వరూ మర్చిపోరు. 

మొత్తానికి ఈ రుద్దుడు కార్యక్రమానికి ఇటీవల వచ్చిన 'శ్రీరస్తు.. శుభమస్తు' చిత్రం కాస్త మంచి ప్రోత్సాహానే ఇచ్చింది. దీంతో ఇక ఈ అల్లు వారబ్బాయ్‌ రెచ్చిపోవడానిక సిద్దమైపోతున్నాడు. మాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్‌ను, ఏ భాషా నిర్మాతలు, హీరోలతోనైనా మంచి సత్సంబంధాలున్న అరవింద్‌గారు మరో అడుగు ముందుకేసి ఈ యువ మెగాస్టార్‌ను ఏకంగా మలయాళ ప్రేక్షకులపై కూడా రుద్దేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో మేజర్‌ రవి దర్శకత్వంలో మలయాళంలో 1971 ఇండో పాక్‌ వార్‌ నాటి సంఘటనలతో 'ఘాజీ'లా ఓ చిత్రం '1971- బియాండ్‌ ది బోర్డర్స్‌' టైటిల్‌తో ఏప్రిల్‌ 17న విడుదలకు రంగం సిద్దం చేసుకుంటోంది. 

ఈ చిత్రంలో అల్లుశిరీష్‌ అనే ఈ 'టాలెంటెడ్‌'హీరో వార్‌ ట్యాంకర్‌ ఆపరేటర్‌గా కీలక పాత్రను పోషిస్తున్నాడు. తమకున్న పలుకుబడితో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో సూపర్‌హిట్‌ కొట్టిన దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ డైరెక్షన్‌లో మరో చిత్రానికి శిరీష్‌ రెడీ అయిపోయాడు. ఈ చిత్రానికి ఏకంగా సీనియర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఓ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. వచ్చే నెలలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. 

allu sirish
allu aravind
prakash raju
chiranjeevi
mohanlal
1971 beyand the boats movie