రణబీర్‌ కొత్త జోనర్‌కు తెరతీయనున్నాడు..!

నేటి చిత్రాలలో ఓ ఆరుపాటలుంటే అబ్బో.. అంటారు. అసలు పాటలే లేని చిత్రాలను కొత్తదనంతో ఆదరిస్తున్నారు. ఇక ఒకే చిత్రంలో ఏకంగా 29 పాటలుంటే ఇక దానిని ఏమంటారు? అలాంటి పాటల చిత్రం ఒకటి ఇప్పుడు విడుదలకు సిద్దమవుతోంది. గతంలో పాత చిత్రాలలోని హిట్‌ పాటలన్నింటిని కలిపి, ఓ చిత్రంగా విడుదల చేసేవారు. కానీ బుల్లితెరపై మ్యూజిక్‌ చానెల్స్‌ పెరిగి పోవడంతో ఈ జోరు ఇప్పుడు వల్లకాదు. తాజాగా ఓ బాలీవుడ్‌ చిత్రం విడుదలకు ముందే పాటల చిత్రంగా పిలవబడుతోంది. 

గత మూడేళ్లుగా రణబీర్‌ కపూర్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ లేదు. ప్రస్తుతం ఆయన రాజ్‌కుమార్‌ హిర్వాణి దర్శకత్వంలో సంజయ్‌దత్‌ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. రాజ్‌కుమార్‌ హిర్వాని మరలా తనకు బ్రేక్‌నిస్తాడని ఆశిస్తున్నాడు. ఇదే సమయంలో ఆయన అనురాగ్‌బస్‌ దర్శకత్వంలో నటిస్తున్న 'జగ్గా జాసూస్‌'పై కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇందులో పాటలు పాడే అలవాటున్న ఓ డిటెక్టర్‌గా రణబీర్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా డిటెక్టివ్‌ కామెడీ జోనర్‌లోే రూపొందుతోంది. ఈ మధ్య ఆయనకు 'యే దిల్‌ హై ముష్కిల్‌' వంటి హిట్‌ వచ్చినా ఆయనకు పెద్దగా క్రెడిట్‌ దక్కలేదు. దాంతో ఈ కపూర్‌ వారసుడి కళ్లన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయట. ఇక ఈ మధ్యకాలంలో 'ఆషికి2'లో మాత్రమే అత్యధికంగా 10పాటలున్నాయి. ఆ రికార్డును ఈ చిత్రం తుడిపివేయనుంది. కాగా ఈ మూవీకి ప్రీతమ్‌ సంగీతం అందిస్తున్నాడు.