బెయిల్ అడిగితే జైలుకు పంపారు

Director

30 కోట్ల మేర ఆర్థిక మోసానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో నిందితులుగా ఉన్నారు విక్ర‌మ్ భ‌ట్ అత‌డి భార్య శ్వేతాంబ‌రి. ఆ ఇద్ద‌రినీ ఉద‌య్ పూర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఈ దంప‌తులు కోర్టును ఆశ్ర‌యించ‌గా, కోర్ట్ దీనిని తిర‌స్క‌రించింది. పైగా కోర్ట్ జుడిషియ‌ల్ క‌స్ట‌డీని విధించింది. కోర్టు ఆదేశంతో వారిని ఉదయపూర్‌లోని సెంట్రల్ జైలుకు పంపుతున్నామ‌ని పోలీసులు తెలిపిన‌ట్టు టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త, త‌న దివంగ‌త‌ భార్యపై బ‌యోపిక్ తెర‌కెక్కించాల‌ని భావించ‌డంతో ఈ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. బ‌యోపిక్ కోసం వ్యాపారి ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్ ని సంప్ర‌దించారు. ఆ స‌మ‌యంలో విక్రమ్ అత‌డి భార్య శ్వేతా ఆ వ్య‌క్తికి 200 కోట్ల మేర లాభం తెస్తామ‌ని త‌ప్పుడు భ‌రోసా క‌ల్పించారని ఆరోపిస్తున్నారు.  

సినిమా పేరుతో దాదాపు 30కోట్లు అత‌డి నుంచి తీసుకున్నారు. అయితే చివ‌రికి బ‌యోపిక్ తెర‌కెక్క‌లేదు. దీంతో అత‌డు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా ఎఫ్.ఐ.ఆర్ న‌మోదైంది. భ‌ట్ -శ్వేతా దంప‌తులు స‌హా మ‌రో ఆరుగురిపైనా కేసులు న‌మోద‌య్యాయి. ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ యజమాని ముర్దియా తన దివంగత భార్యపై బయోపిక్ తీయాలనే క్ర‌మంలో ఈ వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

Filmmaker Vikram Bhatt and his wife Shwetambari

director