నటుడి చేతికి విజయ్ మాల్యా ఆస్తి
Vijay Mallya Kingfisher villa was purchased by Bollywood coupleవిలాసపురుషుడు, దివాళా కింగ్ విజయ్ మాల్యా పరిచయం అవసరం లేదు. కింగ్ ఫిషర్ బ్రాండ్ గురించి వింటే వెంటనే గుర్తుకు వచ్చేది మాల్యానే. వందల కోట్ల అప్పులు ఎగవేసి, బ్యాంకులకు ఐపీ పెట్టిన మాల్యా కొన్నేళ్ల క్రితం యుకేకి పారిపోయాడు. అతడు ఇప్పటికీ ఇండియాకి చిక్కడు దొరకడు. విదేశీ చట్టాల్లో లొసుగుల్ని వాడుకుని అతడు దొరకని దొంగల్లో రికార్డులు సృష్టించాడు.
అయితే మాల్యా నుంచి ఆస్తులు లాక్కున్న బ్యాంకులు వేలానికి పెడుతున్నాయి. వీటిలో ముందుగా గోవాలోని కింగ్ ఫిషర్ విల్లాను వేలం నిర్వహించగా దీనిని ప్రముఖ వ్యాపారవేత్త, సినీనటుడు అయిన సచిన్ జోషి సొంతం చేసుకున్నాడు. వేలంలో దాదాపు 79కోట్ల ధర పలికింది ఈ భవంతి. ఇప్పుడు దీని టైటిల్ ని కింగ్స్ మాన్షన్ అని మార్చారు. గోవా బీచ్ లోని ఈ భవంతిలో ఒకప్పుడు విలాసవంతమైన పార్టీలు జరిగేవి. ఇక్కడే కింగ్ ఫిషర్ క్యాలెండర్ షూట్ కూడా జరిగేది. మోడల్స్ తో మాల్యా రొమాన్స్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా వైరల్ అయ్యేవి.
అదంతా గతం అనుకుంటే, ఇప్పుడు పాన్ మసాలా గుట్కా, ఆల్కహాల్, రియల్ ఎస్టేట్ సహా ఎన్నో వ్యాపారాల్లో సత్తా చాటిన సచిన్ జోషి దీనిని సొంతం చేసుకోవడం చర్చగా మారింది. గతంలో సచిన్ జోషి తెలుగులో ఆషిఖి 2 ని రీమేక్ చేసి రిలీజ్ చేసాడు. ఈ చిత్రంలో హీరోగా కూడా నటించాడు. ఒరేయ్ పండు అనే చిత్రంలోను సచిన్ జోషి హీరోగా నటించాడు. కానీ అతడి పప్పులు సినీరంగంలో ఉడకలేదు. నిర్మాత బండ్ల గణేష్ తో ఆర్థిక వివాదాల తర్వాత అతడు పూర్తిగా పరిశ్రమ నుంచి వైదొలిగాడు.
Actor Sachiin Joshi buys Mallya Kingfisher Villa in Goa







































