ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Public Praises Chandrababu Relief Measures

నాడు.. నేడు అతడే ఒక సైన్యం..

Public Praises Chandrababu Relief Measures

నాడు హుదూద్ తూఫాన్.. నేడు విజయవాడ విలయంను సమర్థవంతంగా ఒకే ఒక్కడై.. అతడే ఒక సైన్యంలా మారి ఎదుర్కొన్నాడు..! నిరంతర సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు.. అధికారులకు సూచనలు, బాధితులకు భరోసా.. క్షణం తీరిక లేదు.. పని చేయని వారికి వార్నింగ్, వ్యానులోనే నిద్ర.. క్షణం క్షణం సహాయక చర్యల్లో నిమగ్నం! 18 గంటలకు పైగానే జనంలోనే ఉంటూ ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి అనిపించుకున్న లీడర్ నారా చంద్రబాబు నాయుడు..! తుఫాన్ వచ్చిన రోజున విశాఖలో వాలిపోయి అన్నీ సెట్ రైట్ చేసి ఇక ప్రశాంతం అన్న తర్వాతే బయటికి వచ్చారు..! ఇప్పుడు కూడా అంతే.. గజ గజలాడుతున్న బెజవాడను గట్టెంక్కించడం కోసం నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారు బాబు. రెండంటే రెండు గంటలే నిద్రపోయి మళ్ళీ ఫీల్డ్ లోకి దిగిపోయారు ఇదీ విజనరీ అంటే.. ఇదీ 40 ఇయర్స్ అనుభవం అంటే అని జనాలు చెప్పుకుంటున్న మాటలు.

నేనున్నాననీ..!

మునుపెన్నడూ చూడని విలయం.. కళ్లెదుటే కరాళనృత్యం! విధ్వంసకర విపత్తు.. చుట్టుముట్టేసిన వైనం! ఆ రక్కసి ధాటికి సర్వం కోల్పోయిన ప్రజలు తల్లడిల్లిన పరిస్థితి..! ఇలాంటి సమయంలో నేనున్నాననీ.. నీకేం కాదనీ అంటూ ప్రజలకు భరోసా ఇవ్వడమే కాదు.. నేరుగా రంగంలోకి దిగిపోయారు..! నాలుగు గోడల మధ్య కూర్చొని సమీక్షలు కాదు.. బస్సులోనే మకాం పెట్టి మరీ బాధితులకు భుజం కాశారు..! వారిలో మనోధైర్యం నింపి బతుకుపై ఆశను నింపారు..! అధికారులను పరుగులు పెట్టించి కూలబడిపోయింది.. ఇక కోలుకోలేదు కష్టమే అనే వైజాగ్ ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టారు. కకావికలమైన బాధితుల కోసం తాను చెమటొడ్చి.. వారి కన్నీరు తుడిచారు చంద్రబాబు..! ఆపదలో ఉన్నవారిని రక్షించడం.. పునరావాసం కల్పించి అవసరమైనవి ఇవ్వడం ఇదే ఆయన నినాదంగా ముందుకెళ్ళారు. ఇదంతా అనుభవంతో నాడు చేసిన.. నేడు బెజవాడ కోసం చేస్తున్న పనులే..!

మీ కోసమే..!

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ వణికిపోయింది.. ఎటు చూసినా వరద నీరే.. వాగులు, వంకలు, జలాశయాలు ఏకమై పొంగి ప్రవహించడంతో బెజవాడ అతలాకుతలమైంది. దీనంతటికీ కారణం బుడమేరు వరద ప్రభావం. దీంతో జిల్లాలో ఏ ప్రాంతం చూసినా వరదలో మునిగిపోయింది. సాయం చేయండి.. కాపాడండి అని ఎక్కడ చూసినా ఆర్తనాదాలే. ఇళ్లలోకి వరద నీరు వచ్చేయడంతో మిద్దె పైకి వెళ్లి కాపాడండి అంటూ ఆర్తనాదాలు. ఇవన్నీ చూసి చలించిపోయిన చంద్రబాబు.. ఏం చేసైనా సరే బాధితులను కాపాడాలి అంటూ రాత్రికి రాత్రే రంగంలోకి దిగిపోయారు. అధికారులను పరుగులు పెట్టించి.. కారెక్కి అదిగో అక్కడికెళ్లు, ఇదిగో ఇక్కడికెళ్ళు అని చెమటలు పట్టించారు. బోటులో, బుల్డోజర్ ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన పరిస్థితి. మరోవైపు కేంద్రంతో మాట్లాడి పవర్ బొట్లు, ఎన్డీఆరెఫ్ సిబ్బందిని తెప్పించి సహాయ చర్యల్లో భాగం చేశారు బాబు. మీకు నేనున్నా కాపాడుతానని బాధితులకు భరోసా ఇస్తూ ముందుకెళ్లారు చంద్రబాబు. అర్థరాత్రి అయినా ముంపు ప్రాంతాల్లోనే ఉండి.. సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ పనిచేస్తామని భరోసా కల్పించారు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. 

కొత్తేమీ కాదు..!

నారా వారికి ఉన్న 40 ఇయర్స్ అనుభవంలో ఎన్నో ప్రళయాలు ఎదుర్కొన్నారు. ప్రకృతి విలయం, ప్రళయాలు ఆపడం ఎవరి తరం కాదు.. కానీ ఎలా ఎదుర్కొన్నారు అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబు ముఖ్యమంత్రిగా ఉండగా 1997లో వచ్చిన హరికేన్ సైక్లోన్ గురుంచి ఈ తరానికి అంతగా తెలియక పోయి ఉండొచ్చు కానీ అదొక పెద్ద విపత్తే. ఇక 2014 వైజాగ్ ప్రాంతంలో వచ్చిన హుదూద్ తుఫాన్ గురుంచి ఐతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు విజయవాడను వరద నుంచి గట్టెక్కిస్తున్న తీరు చంద్రబాబు పాలనా దక్షతకు అద్దం పడుతున్నాయి. ఇదంతా ఒక రోజు, రెండ్రోజులు.. ఐదేళ్ల పాలనలో వచ్చిందేమీ కాదు.. నలభై ఏళ్ల అనుభవం. ఇప్పుడు బెజవాడ గత 50 ఏళ్ళలో ఎన్నడూ చూడని, కలలో కూడా ఊహించని.. కనివిని ఎరుగని వరదల నుంచి జనాలను కాపాడటానికి.. వర్షం ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటికీ ఇంకా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. ఏడు పదుల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెడుతున్నారు. అందుకేనేమో చంద్రబాబును విజినరీ లీడర్, పీపుల్స్ లీడర్ అనేది..!

Chandrababu Naidu The Visionary Leader

chandrababu naidu
bezawada