ఇంతకీ జగన్ ఏం చేస్తున్నట్టు?

అసలే వైసీపీ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. పార్టీలో ఉన్నది చాలా తక్కువమంది. అందులో నుంచి కొందరు జారిపోతున్నారు. ఒక్కొక్కరిగా పార్టీను వీడుతున్నారు. నిన్నగాక మొన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు జగన్‌కు గుడ్ బై చెప్పేశారు. పార్టీకి, పదవులకు రెండింటికి బై బై చెప్పేశారు. మోపిదేవి, బీద మస్తాన్ రాజీనామా నుంచి తేరుకోక మునుపే నిన్న మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసేశారు.

ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి లు ఎమ్యెల్సీగా అయ్యి తక్కువ కాలమే అయ్యింది. అసలు వీరిద్దరూ ఉన్నట్టుండి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, జగన్ పై కోపమా, పార్టీపై అసంతృప్తా, లేకుంటే వ్యక్తిగత కారణాలున్నాయా అనేదానిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇంత జరుగుతున్నా జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు. అంబటి లాంటి వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతున్నా జగన్ కామ్‌గా ఉండడంపై వైసీపీ కేడర్ అయోమయానికి గురవుతుంది. మరోపక్క ఈ రాజీనామాలు ఇక్కడితో ఆగవు, వైసీపీ పార్టీని వీడేవాళ్లు ఇంకొందరు ఉన్నారనే వార్తల నడుమ జగన్ అసలు ఏం చేస్తున్నట్టు అంటూ వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. 

త్వరలోనే మరికొందరు ఎమ్మెల్సీలు.. ఇంకో ఐదుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. మరి ఇదేమి చిన్న విషయం కాదు, దాదాపు పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది, ఇంత జరుగుతున్నా.. జగన్ గారు ఎక్కడ ఉన్నారా? అని ఆయన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆయన స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.

So Many Leaders Decides To Resign YSRCP

What is Jagan doing?
ysrcp
resigns
ys jagan