ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ayyanna Patrudu as a Assembly Speaker of AP

RRRకు చెక్.. అయ్యన్న నోటికి తాళం!

Ayyanna Patrudu as a Assembly Speaker of AP

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు నుంచీ, కూటమి కట్టిన తర్వాత.. ఇక ఫలితాల తర్వాత అబ్బో.. ఇదిగో రఘురామకృష్ణంరాజు స్పీకర్.. అని ఏ పార్టీ అయితే తనకు హ్యాండిచ్చి, అరెస్ట్ చేసి కొట్టించిందో అదే పార్టీ అధినేత తనను అధ్యక్షా అనాల్సిందేనని ఎన్నో కలలు కన్నారు..! అయితే ఆ కలలు సాకారం చేసుకునే విషయంలో RRRకు అడుగడుగునా షాక్‌లే.. అంతకుమించి చెక్‌లు పెడుతూ వచ్చింది టీడీపీ. నాడు వైసీపీని ముప్పు తిప్పలు పెట్టినట్లు మళ్లీ తోక జాడిస్తారని టీడీపీ పెద్దలు అనుకున్నారో లేకుంటే.. మంత్రివర్గంలో చోటు దక్కని సీనియర్లకు స్పీకర్ పదవి కట్టబెట్టాలని అనుకున్నారో తెలియట్లేదు కానీ.. రఘురామను పక్కనెట్టేశారు.

కన్ఫామ్ అయినట్టేనా..?

సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంత్రి వర్గంలోకి తీసుకుంటారని వార్తలు గుప్పుమన్నప్పటికీ ఈసారి చాలా మంది సీనియర్లను అధిష్టానం పక్కనెట్టేసింది. ఇందులో అయ్యన్న కూడా ఒకరు. అంతా ఉడుకు రక్తమే కేబినెట్‌లో చోటు దక్కించుకుంది. దీంతో స్పీకర్ పదవి కట్టబెట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఎందుకంటే.. అయ్యన్నకు అసలే నోరు ఎక్కువ. నోరు తెరిస్తే బూతులు కూడా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే స్పీకర్ సీటులో కూర్చోబెడితే కాస్త నోరు తగ్గించి, హుందాగా ఉంటారన్నది చంద్రబాబు ప్లాన్ అట. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇంకా ఎవరెవరు..?

ఒకవేళ అయ్యన్న కాదంటే మాత్రం ఈయన తర్వాతి రేసులో ఉన్న కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబులో ఎవరో ఒక్కరికి స్పీకర్ పదవి ఇవ్వాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. అయితే ఎన్నికల ముందు వరకూ హడావుడిగా నడిచిన ఆర్ఆర్ఆర్ పేరు రేసులో కాదు కదా.. పరిగణనలోనికి కూడా తీసుకోకపోవడం గమనార్హం. స్పీకర్ పదవి వస్తుందని.. వైఎస్ జగన్ చేత అధ్యక్షా అనిపించుకోవాలని ఎన్నో కలలు కన్నారు. సీన్ కట్ చేస్తే  పరిస్థితి ఇలా ఉంది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఈ రేసులో లోకం మాధవి, పంతం నానాజీ, కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, మండలి బుద్ధప్రసాద్ ఉన్నారని తెలుస్తోంది. అయితే మాధవికే ఈ పదవి వస్తుందని గట్టిగానే టాక్ నడుస్తోంది. ఇక ప్రభుత్వ చీఫ్‌గా ధూళిపాళ్ల నరేంద్రను నియమించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే.. ఇక్కడ కూడా టీడీపీ పొత్తు ధర్మం పాటిస్తోందన్న మాట. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే స్పీకర్ ఎవరన్నది తేలిపోనుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Chandrababu gave check to RRR

chandrababu