2 టాప్ సినిమాలు: దిల్ రాజు వదిలేశాడేంటి?

సంక్రాంతి సీజన్లో రెండు రోజులు గ్యాప్ లో ఒక్కో సినిమా రిలీజ్ అయితేనే అవి వసూళ్లుపై ఎఫెక్ట్ పడుతుంది. అటువంటిది ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ అయితే వచ్చే లాభం తక్కువ, పోతే కలిగే నష్టం ఎక్కువ. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇటువంటి వాతావరణం ఇండస్ట్రీకి మంచిది కాదు.
మరి ఇటువంటి టైములో ఒకేరోజు అంటే జనవరి 12న మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అవుతున్నాయి. నిర్మాతలు, హీరోల మధ్య ఏం జరిగిందో ఖచ్చితంగా తెలియడం లేదు కానీ పంతం మీద రెండు సినిమాలు ఒకే రోజున దిగుతున్నాయని మాత్రం అర్థమవుతోంది.
అల్లు అరవింద్, దిల్ రాజు మంచి సన్నిహితులు అని అందరికి తెలిసిన విషయమే. వీరు అసలు ఇటువంటి పోటీని స్వాగతించరు. వీలైనంత కాంప్రమైజ్ చేసుకుని చెరొక డేట్ లో రిలీజ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పైగా ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాణంలో భాగస్వామి అయిన దిల్ రాజు గీతా ఆర్ట్స్, హారికా హాసిని సంస్థలకు కీలక బయ్యర్. వీరి సినిమాలు దిల్ రాజు కొని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. పైగా ‘అల వైకుంఠపురములో’ చిత్ర నైజాం హక్కుల్ని దక్కించుకున్నారట దిల్ రాజు. అంటే ఇప్పుడు దిల్ రాజువి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆయన రెండూ క్లాష్ అవుతున్నా ఎలా ఊరుకున్నారు, కాంప్రమైజ్ చేయలేదా అనేది ఎవరికి అర్ధం కావడంలేదు. మరి రానున్న రోజుల్లో ఏమన్నా కాంప్రమైజ్ అవుతారేమో చూద్దాం.
Dil Raju Released Ala Vaikunthapurramloo produced Sarileru Neekevvaru
Two Top Movies in Sankranthi 2020 Race







































