అమరావతి - హైదరాబాద్ విమాన ప్రయాణం Rs 400కే
Amaravati-Hyderabad Flight Travel for Just Rs 400
ప్రపంచ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేస్తూ `హార్ట్ ఏరోస్పేస్` తయారు చేసిన అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం `హార్ట్ ఎక్స్1` తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అమెరికాలోని ప్లాట్స్బర్గ్ విమానాశ్రయం నుంచి ఆకాశంలోకి ఎగిరిన ఈ విమానం 27 నిమిషాల పాటు ప్రయాణించి గగనతలంలో కొత్త సంచలనాన్ని సృష్టించింది. ఒక మెగావాట్ శక్తితో నడిచిన ఈ 25,000 పౌండ్ల భారీ విమానానికి అయిన విద్యుత్ ఖర్చు కేవలం 5 డాలర్లు (సుమారు రూ. 400) మాత్రమే కావడమే ఇక్కడ అసలైన విశేషం. సంప్రదాయ విమాన ఇంధన ఖర్చులతో పోలిస్తే ఇది అత్యంత చౌకైనది కావడంతో, భవిష్యత్తులో సామాన్యులకు కూడా రూ. 400 రేంజ్లోనే స్వల్ప దూర విమాన ప్రయాణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రైల్వే వ్యవస్థలో ఇ-ట్రైన్లు, రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు, భోగాపురం ఎయిర్పోర్ట్కు ప్రయాణికులను చేరవేసే ఇ-వాహనాల హవా పెరిగినట్లే... తదుపరి భారతదేశం అడాప్ట్ చేసుకోబోయే నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఈ ఎలక్ట్రిక్ విమానాలే అనడంలో సందేహం లేదు. ఈ సాంకేతికత ఆధారంగా రూపొందుతున్న 30 సీట్ల `ఈఎస్-30` మోడల్ విమానాలు 2031 నాటికి పూర్తిస్థాయి సేవలందించేందుకు సిద్ధమవుతుండగా... యునైటెడ్ ఎయిర్లైన్స్, ఎయిర్ కెనడా వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే వందలాది ఆర్డర్లు ఇచ్చాయి. ఈ విమానాలు అందుబాటులోకి వస్తే మన దేశంలో ముఖ్యంగా అమరావతి నుండి హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ వంటి తక్కువ దూర ప్రాంతాలకు ప్రయాణ సమయం, ఛార్జీలు భారీగా తగ్గి ప్రాంతీయ రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవం రానుంది.








































