శంకర్ మరొకటి లైన్లో పెట్టేసుకున్నాడు

Director Shankar Signs One More Movie

దక్షిణాది దిగ్గజ దర్శకుడు శంకర్‌ తన మొదటి చిత్రం ‘జెంటిల్‌మేన్‌’ నుంచి అన్ని చిత్రాలను పెద్ద స్టార్స్‌తోనే చేశాడు. ‘త్రీ ఇడియట్స్‌’కి రీమేక్‌గా తీసిన ‘స్నేహితుడు’ చిత్రంలో జీవా వంటి వారు ఉన్నా విజయ్‌ వంటి స్టార్‌ని పెట్టుకున్నాడు. ఇక ఇటీవల ఆయన తీసిన చిత్రాలు పెద్దగా సంచలనాలు నమోదు చేయడం లేదు. ‘ఐ’, ‘2.ఓ’ చిత్రాలలో ఆయన హ్యూమన్‌ ఎమోషన్స్‌ని మిస్‌ చేసి, గ్రాఫిక్స్‌, ఇతర విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. హీరోల గెటప్‌లు, విలన్ల మేకోవర్స్‌ తప్ప కథలో బలం లేని చిత్రాలు తీశాడు. 

సాధారణంగా సినిమాకి సినిమాకి ఎంతో గ్యాప్‌ తీసుకునే శంకర్‌ ఇప్పుడు మాత్రం ‘2.ఓ’ తర్వాత పెద్దగా గ్యాప్‌ ఇవ్వకుండానే లోకనాయకుడు కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ మొదలుపెట్టాడు. ఇందులో కమల్‌హాసన్‌కి జంటగా కాజల్‌ నటిస్తుండగా, సేనాని మనవడి పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రకు శింబు, సిద్దార్ద్‌లను కాదని ఆర్యని తీసుకున్నాడు. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పొలాచ్చిలో వేసిన భారీ సెట్‌లో ప్రారంభం అయింది. కానీ వారం రోజులు షూటింగ్‌ చేసిన తర్వాత రెండు నెలలు కష్టపడి, ఎంతో బడ్జెట్‌తో వేసిన సెట్‌ తన అభిరుచికి అనుగుణంగా లేదని శంకర్‌ షూటింగ్‌ను ఆపేసి, మరలా మొదటి నుంచి తీయాలని నిర్ణయించాడని వార్తలు వచ్చాయి. 

ఇక ఈ చిత్రాన్ని ఏకంగా ఎనిమిది దేశాలలోని అద్భుతమైన లొకేషన్స్‌లో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘భారతీయుడు 2’ ఇంకా ఇలా డోలాయమానంలోనే ఉండగానే శంకర్‌ తదుపరి చిత్రం కూడా కన్‌ఫర్మ్‌ అయిందని సమాచారం. ఈసారి ఆయన ఇద్దరు యంగ్‌ హీరోలను, అందునా స్టార్‌ హీరోల వారసులతో ఈ చిత్రాన్ని తీయనున్నాడట. తమిళ స్టార్‌ విజయ్‌ సోదరుడైన ‘జాసన్‌ సంజయ్‌’, విక్రమ్‌ కుమారుడు ‘దృవ్‌’లను ఇందులో హీరోలుగా ఎంచుకున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం విక్రమ్‌ కుమారుడు దృవ్‌ బాలా దర్శకత్వంలో తెలుగు ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా ‘వర్మ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దృవ్‌ రెండో చిత్రమే శంకర్‌తో అంటే ఇక ఈ ఇద్దరు వారసులకి తిరుగే ఉండకపోవచ్చని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. 

Shankar Movie with Vijay Brother and Vikram Son

shankar movie
vijay
brother
vikram
son